Virat Kohli – Gautam Gambhir : టీమ్ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ను బీసీసీఐ నియమించింది. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీర్ శ్రీలంక పర్యటనతో తన బాధ్యతలను చేపట్టనున్నాడు. సహాయక ఆటగాళ్ల ఎంపిక విషయంలో గంభీర్ కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛని ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉంటే.. గంభీర్ ను కోచ్గా ఎంపిక చేసే సమయంలో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అభిప్రాయాన్ని బీసీసీఐ తీసుకోలేదట. కనీసం అతడికి సమాచారాన్ని కూడా అందించలేదట.
హెడ్ కోచ్గా గంభీర్ ఎంపిక కావడంతో ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఓ చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. కోహ్లీతో హెడ్కోచ్ గా గంభీర్ ఎలా వ్యవహరిస్తాడు అన్నదే. వాస్తవానికి గంభీర్-కోహ్లి మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ సమయంలో పలుమార్లు వీరిద్దరు వాగ్వాదానికి దిగిన ఘటనలు చూశాం. అయితే.. ఐపీఎల్ 2024 సీజన్ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుని తమ పాత గొడవలకు పుల్ స్టాప్ పెట్టారు. కాగా.. అదంతా కెమెరాల కోసమేనని కొందరు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కోచ్ను ఎంపిక చేసే సమయంలో జట్టులోని సీనియర్ ఆటగాళ్ల అభిప్రాయాలను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తీసుకుంటుంటాయి. అలాగే కోహ్లి అభిప్రాయాన్ని తీసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిప్రాయాలను మాత్రమే బీసీసీఐ తీసుకున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టీమ్ఇండియా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోహ్లీని విస్మరించినట్లుగా సదరు కథానాలు పేర్కొన్నాయి.
ఇప్పటికే టీ20 ఫార్మాట్కు రోహిత్, కోహ్లిలు గుడ్ బై చెప్పేశారు. పొట్టి ఫార్మాట్కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ కానుండడం లాంఛనమే. వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత కోహ్లి వన్డేలు ఆడతాడో లేదోనన్న వాదన వినిపిస్తోంది. టెస్టుల్లో మాత్రం మరికొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది. అటు గంభీర్ పర్యవేక్షణలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, డబ్ల్యూటీసీ 2025 ఫైనల్, టీ20 ప్రపంచకప్ 2026, వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీలను ఆడనుంది.
Irfan – Yusuf : ఏంటి భయ్యా మీరు కూడానా..? ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ల మధ్య గొడవ..! వీడియో..
ఈ క్రమంలో బీసీసీఐ కూడా భవిష్యత్ టోర్నీల నేపథ్యంలో కోహ్లీకీ అంతగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకనే గంభీర్ను కోచ్గా నియమిస్తున్న విషయాన్ని మాటమాత్రానికైనా కోహ్లికి చెప్పలేదని అంటున్నారు. ఈ విషయమై ఓ జాతీయ మీడియాతో బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘వాళ్లిద్దరూ విభేదాలను పక్కనబెట్టి చర్చించుకునేందుకు చాలా సమయముంది. అయితే.. బీసీసీఐ మాత్రం దీర్ఘకాలిక ప్రణాళికలో ఉంది. సీనియర్లు కెరీర్ చరమాంకంలో ఉన్న వేళ కొత్త కుర్రాళ్లు ఆ స్థానాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేయాలి.’ అని అన్నాడు.