BCCI సంచలన డిమాండ్ : క్రికెట్ వరల్డ్ కప్ నుంచి పాక్ జట్టు ఔట్!

  • Publish Date - February 21, 2019 / 05:37 AM IST

క్రికెట్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఉండాలా.. వద్దా.. ఏంటీ షాక్ అయ్యారా..? ఇప్పుడు ఇదే బిగ్ క్వశ్చన్ అయ్యింది. పుల్వామా దాడి తర్వాత పాక్ జట్టుతో క్రికెట్ ఆడకూడదనే డిమాండ్ ప్రజల నుండి వస్తుంది. బీసీసీఐ కూడా సరే అంటూనే.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా మా ఫైనల్ డెసిషన్ ఉంటుందని వెల్లడించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. BCCI మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే క్రికెట్ వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ జట్టును బహిష్కరించాలని కోరుతూ ICCకి లేఖ రాయాలంటూ రాహుల్ జోహ్రీని కోరినట్లు తెలుస్తుంది. రాహుల్ జోహ్రీ బీసీసీఐ తరుపున ఐసీసీ సమావేశాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

    టెర్రరిస్టుల దేశంగా ముద్రవేయాలని.. క్రీడల్లోనూ పాకిస్తాన్ జట్టును బహిష్కరించినప్పుడు ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని బీసీసీఐ అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రదాడులు జరుగుతున్నా.. పాక్ లో ఆ దాడికి సంబంధించిన మూలాలు ఉంటున్నాయని లేఖలో ప్రస్తావించనుంది. పాక్ లేని ప్రపంచ క్రీడలను కోరుకుంటున్నామని.. అప్పుడైనా ఆ దేశం తీరు మారుతుందని తన వైఖరిని లేఖ ద్వారా ICC (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)ను కోరనుంది. BCCI సంచలన నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తోంది. ప్రపంచంలోనే క్రికెట్ ఆడే దేశాల్లోనే ధనవంతమైన బోర్డు ఇది. అలాంటి బోర్డు నుంచే ఇలాంటి డిమాండ్ రావటంతో మిగతా దేశాలు షాక్ కు గురయ్యాయి. బీసీసీఐ నిర్ణయాన్ని ఆసియా దేశంలోని బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ బోర్డులు పాజిటివ్ గా స్పందించే అవకాశం ఉన్నా.. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఇతర క్రికెట్ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయో అనేది చూడాలి. బీసీసీఐ డిమాండ్ ను.. ICC ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
  

 క్రికెట్ వరల్డ్ కప్ అంటేనే ఫ్యాన్స్ పీక్ లో ఉంటారు.. భారత్ – పాక్ మ్యాచ్ అంటే హైఓల్టేజ్ టెన్షన్. ఇప్పుడు ఆదే పాకిస్తాన్ దేశం వరల్డ్ కప్ లో లేకపోతే మజా ఉంటుందా అనే ప్రశ్న వస్తోంది. టెర్రరిజానికి క్రీడలతో ముడిపెట్టటం భావ్యం కాదనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. పాక్ ను ఏకాకి చేయటం వల్ల టెర్రరిజం తగ్గుతుంది అనలేం అని.. మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదనే వారూ లేకపోలేదు. పాక్ లేని క్రికెట్ వరల్డ్ కప్ ఉంటుందా.. లేదా అనే క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది. ఇక భారత్‌, పాకిస్తాన్ జట్లు 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్‌ లాంటి మెగా టోర్నీల్లో మాత్రమే రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. పుల్వామా దాడితో మెగా టోర్నీల్లో కూడా ఇకపై రెండు జట్లు ఆడే అవకాశం తగ్గిపోయింది.