Kidambi Srikanth : చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. BWF చాంపియన్షిప్లో భారత్కి తొలి పతకం..!
భారత్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. స్పెయిన్ లో జరుగుతున్న BWF వరల్డ్ చాంపియన్ షిప్ లో సెమీస్ కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో భారత్ కు తొలి పతకం ఖాయం చేశాడు
- Naveen
- Updated on- December 17, 2021 / 11:49 PM IST
Kidambi Srikanth
Kidambi Srikanth : భారత్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. స్పెయిన్ లో జరుగుతున్న BWF వరల్డ్ చాంపియన్ షిప్ లో సెమీస్ కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో భారత్ కు తొలి పతకం ఖాయం చేశాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ లో మాజీ ప్రపంచ చాంపియన్, డచ్ ప్లేయర్ మార్క్ కల్జౌపై శ్రీకాంత్.. 21-8, 21-7తో వరుస సెట్లతో గెలిచాడు.
కేవలం 26 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో కిదాంబి శ్రీకాంత్ ప్రత్యర్థిని చిత్తు చేశాడు. దీంతో సెమీస్ కు చేరి పతకం ఖాయం చేసుకున్నాడు. గురువారం ప్రీక్వార్టర్స్లో చైనా షట్లర్ జంగ్ జుని 21-10, 21-15 తేడాతో ఓడించి జోరందుకున్న కిదాంబి శ్రీకాంత్.. ఈరోజు కూడా అదే దూకుడుని కొనసాగించాడు. దాంతో ఏ దశలోనూ డచ్ షట్లర్కి పుంజుకునే అవకాశం దక్కలేదు.
Lose Weight : బరువు తగ్గాలంటే… ఉదయం బ్రేక్ ఫాస్ట్లోకి ఇవి తీసుకోండి
ఫస్ట్ సెట్ ఆరంభంలోనే 11-5తో ఆధిక్యాన్ని అందుకున్న శ్రీకాంత్.. చివరికి 21-8తో సెట్ని ముగించేశాడు. రెండో సెట్లోనూ అదే జోరు కనిపించింది. మొత్తంగా.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కిదాంబి శ్రీకాంత్కి ఇదే మొదటి పతకం కాగా.. ఫురుషుల సింగిల్స్లో భారత్కి లభించనున్న మూడో పతకం ఇది. గతంలో వరల్డ్ చాంపియన్ షిప్స్ మెన్స్ సింగిల్స్ విభాగంలో భారత కు 2 పతకాలొచ్చాయి. ప్రకాశ్ పదుకొనె, సాయి ప్రణీత్ ఈ లిస్ట్ లో ఉన్నారు.
కాగా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ షిప్ లో మరో తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో చైనీస్ తైపీ షట్లర్ తైజుయింగ్ చేతిలో 21-17, 21-13 తేడాతో సింధు ఓటమి పాలైంది. తైజుయింగ్తో ఇప్పటి వరకూ 20 సార్లు తలపడిన సింధుకి.. ఇది 15వ ఓటమి కావడం గమనార్హం.
