Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన ఆనందంలో ఉన్న రోహిత్ శర్మకు ఐసీసీ షాక్.. ఇలా చేశారేంటి..?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టును ఐసీసీ ప్రకటించింది.
- Thota Vamshi Kumar
- Published On : March 11, 2025 / 10:39 AM IST
Champions Trophy 2025 Team of the Tournament announced by ICC no place for Rohit sharma
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను భారత్ చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అత్యధిక సార్లు ఈ ట్రోఫీని అందుకున్న జట్టుగా టీమ్ఇండియా రికార్డుల్లోకి ఎక్కింది.
రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టు 12 సంవత్సరాల తరువాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో ఆటగాళ్లతో పాటు టీమ్ఇండియా అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.
ఫైనల్ మ్యాచ్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (76 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా రోహిత్కు ఐసీసీ షాక్ ఇచ్చింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన ఒక రోజు తరువాత ఐసీసీ ఈ టోర్నీలో పాల్గొని అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లలోంచి అత్యుత్తమ జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. అయితే.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం స్థానం దక్కలేదు.
NZ vs PAK : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీని ఔట్ చేశాడు.. కెప్టెన్ అయ్యాడు..
టీమ్ఇండియా నుంచి విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీలకు తుది జట్టులో చోటు ఇచ్చింది. అదే సమయంలో 12వ ఆటగాడిగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ఎంపిక చేసింది.
ఇక న్యూజిలాండ్ నుంచి నలుగురు.. రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, మాట్ హన్రీలకు చోటు దక్కింది. అఫ్గానిస్థాన్ నుంచి ఇద్దరు ఇబ్రహీం జాద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ లను తీసుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్..
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, ఇబ్రహీం జాద్రాన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మాట్ హెన్రీ, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్.
