Pujara-Rahane : రహానే, పుజారా కెరీర్ ఇక ముగిసినట్లేనా? టీమ్ఇండియాలో వారిని మళ్లీ చూడలేం?
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారాల టెస్టు కెరీర్ ఇక ముగిసినట్లేనా అనే ప్రశ్నకు దాదాపుగా అవుననే సమాధానమే వినిపిస్తోంది
- Thota Vamshi Kumar
- Published On : January 25, 2024 / 11:41 AM IST
Cheteshwar Pujara -Ajinkya Rahane
Cheteshwar Pujara -Ajinkya Rahane : టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారాల టెస్టు కెరీర్ ఇక ముగిసినట్లేనా అనే ప్రశ్నకు దాదాపుగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. తొలి టెస్టు మ్యాచ్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఇంగ్లాండ్తో మొదటి రెండు టెస్టుకు వ్యక్తిగత కారణాలతో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరం అయిన సంగతి తెలిసిందే. కోహ్లీ స్థానంలో రహానే లేదా పుజారాలలో ఒకరికి అవకాశం దక్కుతుందని అంతా భావించారు. అయితే.. అనూహ్యంగా యువ ఆటగాడు రజత్ ఫాటిదార్కు ఛాన్స్ ఇచ్చారు.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ ఆలోచన విధానం గమనిస్తే సీనియర్ ఆటగాళ్లు రహానే, పుజరాలకు మళ్లీ టీమ్ఇండియాలో చోటు దక్కడం చాలా కష్టమేనని అనిపిస్తోంది. పాటిదార్ ను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని రోహిత్ శర్మ వివరించాడు.
యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భావించడంతోనే సీనియర్లను జట్టులోకి తీసుకోలేదన్నాడు. సీనియర్ ప్లేయర్లను పరిగణలోకి తీసుకోకపోవడం చాలా కష్టమైన విషయమేనని చెప్పాడు. జట్టు కోసం వాళ్లు సాధించిన పరుగులు, విజయాలు, అనుభవం వంటి వాటిని విస్మరించడం కష్టం అని అభిప్రాయపడ్డాడు.
Mary Kom : నేను అలా ఎక్కడా చెప్పలేదు.. రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేరీకోమ్
అదే సమయంలో యువ ఆటగాళ్లకు నేరుగా విదేశాల్లో అవకాశం ఇవ్వకుండా అనువైన పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వాలనే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపాడు. అయినప్పటికీ ఎవ్వరికి అయినా టీమ్ఇండియా తలుపు తట్టే అవకాశం ఉందన్నాడు. ఫిట్నెస్ కాపాడుకుంటూ మెరుగైన ప్రదర్శన చేస్తే పునరాగమనం చేయొచ్చునని సూచించాడు.
ఆ పరిస్థితి రావొద్దనేనా..!
ప్రస్తుతం భారత జట్టులోని ఆటగాళ్ల వయసును పరిగణలోకి తీసుకుంటే.. రోహిత్ (36), విరాట్ కోహ్లీ (35), ఆర్.అశ్విన్ (37), రవీంద్ర జడేజా (35) ల వయస్సు 35కు పై బడే ఉంది. వీరిందరూ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. ఒకేసారి అందరూ నిష్ర్కమిస్తే టీమ్ఇండియా సందిగ్థ పరిస్థితి ఎదుర్కొంటుంది. అందుకనే వారు ఆటకు వీడ్కోలు చెప్పేలోపే యువ ఆటగాళ్లను తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లుగా రోహిత్ మాటలను బట్టి అర్ధం అవుతోంది.
కాగా.. రహానేకు టీమ్ఇండియా తరుపున పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ ఆఖరిది కాగా.. పుజారాకు గతేడాది ఓవర్లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ చివరిది.
