HCA : మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన.. మద్యం సేవిస్తూ.. బండ బూతులు తిడుతూ..
హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది.
- Thota Vamshi Kumar
- Published On : February 16, 2024 / 10:50 AM IST
Coach misbehavior with women cricketers
Hyderabad Cricket Association : హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోచ్ జైసింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కోచ్ జై సింహా పై మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. అయితే.. ఫిర్యాదు చేసి నాలుగు రోజులు దాటినప్పటికీ అతడి పై చర్యలు తీసుకోకపోవడంతో ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్ కోసం మహిళ క్రికెటర్ల హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు విమానంలో రావాల్సి ఉంది. అయితే.. కావాలనే కోచ్ జైసింహా ఆలస్యం చేయడంతో ప్లైట్ మిస్ అయింది. దీంతో వారంతా బస్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. ఈ క్రమంలో వారి ముందే జై సింహా మద్యం సేవించాడు. ఇందుకు ప్లేయర్లు అడ్డుచెప్పారు. దీంతో జై సింహా ఆగ్రహంతో ఊగిపోయాడు. మహిళా క్రికెటర్లను బండ బూతులు తిట్టాడు.
Kane Williamson : బాబోయ్.. కేన్ విలియమ్సన్ వీరబాదుడు.. టెస్టుల్లో సరికొత్త రికార్డు
ఇదంతా జరుగుతున్న సమయంలో సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమరావు బస్లోనే ఉన్నాడు. అతడు జై సింహాను అడ్డుకోలేదు సరికదా ఇంకా ఎంకరేజ్ చేశాడు. ఈ ఘటనపై మహిళా క్రికెటర్లు హెచ్సీఏలో ఫిర్యాదు చేశాడు. దీంతో టీమ్ నుంచి తప్పిస్తామంటూ ప్లేయర్లను కోచ్ బెదిరిస్తున్నట్లు వారు తెలిపారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం..
కాగా.. కోచ్ జైసింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదన్నారు. క్రిమినల్ కేసులు పెడతాం, పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతామన్నారు. మహిళా క్రికెటర్లకు హెచ్సీఏ అండగా ఉంటుందన్నారు. హైదరాబాద్ మహిళా హెడ్ కోచ్ విద్యుత్ జయ సింహను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. విచారణ ముగిసే వరకు కోచ్ పదవి నుంచి అతడిని తప్పిస్తున్నట్లుగా చెప్పారు.
