AUS vs IND : ఆ ఇద్దరు సీనియర్లు వద్దు.. ఈ ఇద్దరు కుర్రాళ్లే ముద్దు..
వరుసగా మూడో సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని దక్కించుకోవాలని భారత జట్టు ఆరాటపడుతోంది.
- Thota Vamshi Kumar
- Published On : September 2, 2024 / 02:40 PM IST
Dinesh Karthik picks Cheteshwar Pujara and Ajinkya Rahanes replacement in Tests
వరుసగా మూడో సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని దక్కించుకోవాలని భారత జట్టు ఆరాటపడుతోంది. నవంబర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ జరగనుంది. 1992 తరువాత ఇరు దేశాల మధ్య ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ జరగనుండడం ఇదే తొలిసారి. కాగా.. గత సిరీసుల్లో సీనియర్ ఆటగాళ్లు ఛతేశ్వేర్ పుజారా, అజింక్యా రహానె లు కీలక పాత్ర పోషించారు. అయితే.. ఫామ్ లేమీతో ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు దూరం అయ్యారు.
ఈ సారి ఈ ఇద్దరూ కూడా జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో ఫైనల్కు చేరుకునేందుకు భారత్ కు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఈ క్రమంలో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్ల గురించి దినేశ్ కార్తీక్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే స్థానాలను భర్తీ చేయడం అంత సులభం కాదన్నాడు. అయితే.. యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తేనే భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంటుందన్నాడు. పుజారా-రహానెలకు బదులుగా శుభ్మన్ గిల్-సర్ఫరాజ్ ఖాన్లు ఆడితే బాగుంటుందనేది తన అభిప్రాయమన్నారు. వీరిద్దరూ ఇంగ్లాండ్తో సిరీస్లో చాలా చక్కగా ఆడారన్నారు. ఆసీస్ పర్యటనకు వీరిద్దరిని ఎంపిక చేస్తారని తాను భావిస్తున్నట్లు కార్తీక్ చెప్పుకొచ్చాడు.
నాలుగేళ్ల క్రితం శుభ్మన్ గిల్ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 25 టెస్టుల్లో 35.5 సగటుతో 1492 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, ఆరు అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 128. ఇక తనకు వచ్చిన అవకాశాన్ని సర్ఫరాజ్ ఖాన్ చాలా చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. మూడు టెస్టు మ్యాచుల్లో 50 సగటుతో 200 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థశతకాలు ఉండడం గమనార్హం.
Gautam Gambhir : రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలకు షాకిచ్చిన గంభీర్.. కోహ్లీకి చోటు..
