Ajaz Patel : విచిత్ర బౌలర్.. స్వదేశంలో నో వికెట్.. కానీ విదేశాల్లో 62 వికెట్లు..! భారత సంతతి ఆటగాడే
New Zealand spinner Ajaz Patel : స్వదేశంలో ఏ మాత్రం ప్రభావం చూపని ఇతడు విదేశాల్లో మాత్రం జట్టుకు కీలక ఆటగాడిగా మారుతున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : December 9, 2023 / 04:32 PM IST
Ajaz Patel
సాధారణంగా చాలా మంది బౌలర్లు స్వదేశంలోని పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ వికెట్లు పడగొట్టడాన్ని చూస్తూనే ఉంటాం. స్వదేశంలో అత్యంత ప్రమాదకరంగా కనిపించే కొందరు బౌలర్లు విదేశాల్లో మాత్రం తేలిపోతుంటారు. అయితే.. ఇందుకు భిన్నంగా ఓ బౌలర్ ఉన్నాడు. స్వదేశంలో ఏ మాత్రం ప్రభావం చూపని ఇతడు విదేశాల్లో మాత్రం జట్టుకు కీలక ఆటగాడిగా మారుతున్నాడు. ముఖ్యంగా స్పిన్కు అనుకూలించే ఉప ఖండపు పిచ్లపై అయితే దుమ్మురేపుతున్నాడు. అతడు మరెవరో కాదు భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్.
ఆలస్యంగా అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ..
అంతర్జాతీయ క్రికెట్లో ఆలస్యంగా అడుగుపెట్టాడు అజాజ్ పటేల్. ఐదేళ్ల క్రితం అంటే 2018లో తనకు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పాకిస్తాన్తో జరిగిన టెస్టు మ్యాచుతో కివీస్ తరుపున అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచులో తానెంత విలువైన ఆటగాడినో చాటి చెప్పాడు. ఈ మ్యాచులో అతడు ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండేళ్ల క్రితం 2021లో ముంబైలో భారత్తో జరిగిన మ్యాచులో ఓ ఇన్నింగ్స్లో ఏకంగా పదికి పది వికెట్లు తీసి అరుదైన ఘనతను సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని చూసించాడు.
WPL Auction 2024 : ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ మినీవేలం.. భారీ ధరకు అమ్ముడైన ఆసీస్ ప్లేయర్
తన కెరీర్లో ఇప్పటి వరకు 16 టెస్టు మ్యాచులు ఆడిన అజాజ్ పటేల్ 29.75 సగటుతో 62 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అత్యుత్తమ బౌలింగ్ 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు. కాగా.. అతడు తీసిన వికెట్లు అన్నీ ఉపఖండపు పిచ్లు అయిన శ్రీలంక, భారత్, బంగ్లాదేశ్, యూఏఈ లోనే కావడం గమనార్హం. అతడు స్వదేశంలో వెల్లింగ్టన్, క్రైస్ట్చర్చ్లలో మూడు టెస్టులు ఆడి 49 ఓవర్లు వేశాడు. అయితే.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. చూడాలి మరీ రానున్న రోజుల్లో అయినా అతడు స్వదేశం అయిన న్యూజిలాండ్లో కనీసం ఒక్క వికెట్ అయినా తీస్తాడో లేదో. కాగా.. ప్రస్తుతం అతడి వయస్సు 35 సంవత్సరాలు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌటైంది. అనంతరం కివీస్ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులు చేసింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన బంగ్లాదేశ్ 144 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్ ముందు 136 పరుగుల లక్ష్యం నిలవగా న్యూజిలాండ్ ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది.
