Sanju Samson-Jadeja : సంజూ శాంసన్-రవీంద్ర జడేజా ట్రేడ్ డీల్లో సూపర్ ట్విస్ట్..
సంజు శాంసన్ సీఎస్కేకు మారే అవకాశం ఉందన్న ట్రేడ్ డీల్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : November 12, 2025 / 11:48 AM IST
Drama In Samson Jadeja Trade Deal Rajasthan Royals Enter Complex Scenario
Sanju Samson-Jadeja : ఐపీఎల్ 2026 సీజన్కు ముందు పలు ట్రేడ్ డీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంజు శాంసన్ సీఎస్కేకు మారే అవకాశం ఉందన్న ట్రేడ్ డీల్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఇచ్చి సంజూ శాంసన్ను ట్రేడింగ్ ద్వారా (SanjuSamson-Jadeja) జట్టులోకి తీసుకురావాలని సీఎస్కే భావిస్తోండగా.. జడేజాతో పాటు సామ్ కరన్ సైతం కావాలని ఆర్ఆర్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో రెండు జట్లు కూడా ఈ విషయం చర్చలు జరుపుతున్నాయి. రాజస్థాన్ కండిషన్స్కు సీఎస్కే ఒకే చెప్పగా.. ఇక ఫ్రాంఛైజీ మారేందుకు ప్లేయర్లు కూడా సమ్మతి ఇచ్చారు. అయితే.. తాజాగా ఈ రెండు జట్ల మధ్య ట్రేడింగ్ చర్చలు నిలిచిపోయినట్లు సమాచారం. క్రిక్బజ్ ప్రకారం సామ్ కరన్ను ఆర్ఆర్ తమ జట్టులోకి చేర్చుకునేందుకు పలు ఇబ్బందులు ఎదురుఅవుతున్నాయి.
ఎందుకంటే ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ప్రతి ఫ్రాంఛైజీ కూడా గరిష్టంగా ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. జోఫ్రా ఆర్చర్, షిమ్రాన్ హెట్మేయర్, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, ఫజల్హాక్ ఫరూకీ, క్వేనా మఫాకా, నాండ్రే బర్గర్, లుయాండ్రే ప్రిటోరియస్లు ఇప్పటికే ఆర్ఆర్ జట్టులో ఉన్నారు. దీంతో ఆర్ఆర్ విదేశీయుల కోటా నిండిపోయింది.
ఈ ఇబ్బంది ఎలాగోలా అధిగమించినా కూడా మరో సమస్య ఉంది. సామ్ కరన్ను కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఆర్ఆర్ వద్ద సరిపడా నిధులు లేదు. ప్రస్తుతం ఆ జట్టు పర్స్ వాల్యూ కేవలం రూ.30లక్షలుగా ఉంది. వేలంలో సీఎస్కే సామ్ కరన్ను రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
జడేజాతో పాటు కరన్ను జట్టులో చేర్చుకోవాలంటే..?
జడేజాతో పాటు కరన్ను ఆర్ఆర్ జట్టులోకి చేర్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంది. అందుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సామ్ కరన్ కోసం రాజస్థాన్ ఓ విదేశీ ఆటగాడిని వేలానికి విడుదల చేయాల్సి ఉంటుంది. అప్పుడు విదేశీ ప్లేయర్ల కోటాలో ఓ స్థానం ఖాళీ కావడంతో పాటు ఆ ఆటగాడి నగదు కూడా ఆర్ఆర్ పర్స్ వాల్యూకు యాడ్ అవుతుంది.
ఇప్పుడు ఆర్ఆర్ ఎవరిని వేలానికి విడుదల చేస్తుంది? ఎంత నగదు ఆ ఫ్రాంఛైజీకి యాడ్ అవుతుంది అన్న దానిపైనే కరన్ ను జట్టులోకి చేర్చుకునే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
19 ఏళ్ల వయసులో తొలి టైటిల్..
ఐపీఎల్ ఆరంభ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో 19 ఏళ్ల వయసులో రవీంద్ర జడేజా చేరాడు. తొలి ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. రెండేళ్ల పాటు అతడు ఆర్ఆర్కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే.. 2010 సీజన్కు ముందు అతడు ముంబై ఇండియన్స్తో నేరుగా ఒప్పందానికి చర్చలు జరపడానికి ప్రయత్నించడంతో ఓ సంవత్సరం పాటు అతడిపై నిషేదం పడింది.
నిషేదం ముగిసిన తరువాత అతడు 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ తరుపున ఆడాడు. 2012లో అతడు చెన్నై జట్టులో భాగం అయ్యాడు. సీఎస్కే పై సస్పెప్షన్ విధించబడిన రెండు సంవత్సరాలు మినహా.. గత దశాబ్ద కాలంలో జడేజా సీఎస్కే జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. సీఎస్కే ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందుకోగా ఇందులో మూడు ట్రోఫీలు అందుకోవడంలో సాయం చేశాడు.
