India Women vs England Women 2nd T20 : మూడు మ్యాచుల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ మహిళల జట్టు సొంతం చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచులో ఇంగ్లాండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 11.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఆలిస్ క్యాప్సే (25; 21 బంతుల్లో 4 ఫోర్లు), నాట్ స్కివర్-బ్రంట్ (16; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, దీప్తిశర్మ చెరో రెండు వికెట్లు తీశారు. సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 16.2 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (30; 33 బంతుల్లో 2 ఫోర్లు) రాణించగా మిగిలిన వారిలో స్మృతి మంధాన (10) మాత్రమే రెండు అంకెల స్కోరు చేసింది. షఫాలీ వర్మ (0), హర్మన్ప్రీత్ కౌర్ (9), దీప్తి శర్మ (0), రిచా ఘోష్ (4), పుజా వస్త్రాకర్ (6) లు విఫలం అయ్యారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఏదీ కలిసి రాలేదు. మొదటి ఓవర్లో రెండో బంతికే స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ డకౌట్ కాగా.. మరికాసేపటికే స్మృతి మంధాన పెవిలియన్కు చేరుకుంది. వీరిద్దరిని కూడా షార్లెట్ డీన్ ఔట్ చేసింది. ఆదుకుంటుందని భావించిన హర్మన్ప్రీత్, దీప్తిశర్మ కూడా చేతులెత్తేశారు.
ఆ తరువాత వచ్చిన రిచా ఘోష్, పుజా, శ్రేయాంక పాటిల్ (4), టిటాస్ సాధు (2), సైకా ఇషాక్ (8) కూడా ఒకరి తరువాత మరొకరు పెవిలియన్కు చేరడంతో టీమ్ఇండియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఎకిల్స్టోన్, షార్లెట్ డీన్, లారెన్ బెల్, సారాగ్లెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. నాట్సీవర్, ఫ్రెయా కెంప్ చెరో వికెట్ తీశారు.
BCCI : ఏడాదికి బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..? ఆస్ట్రేలియాతో పోలిస్తే ఎక్కువా..? తక్కువా..?
నామమాత్రమైన చివరి టీ20 మ్యాచ్ ముంబై వేదికగా డిసెంబర్ 10న జరగనుంది.