Praveen Kumar : గతేడాది డిసెంబర్లో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతిని ఇంకా మరిచిపోకముందే మరో క్రికెటర్ ప్రమాదానికి గురి అయ్యాడు. అయితే.. సదరు మాజీ క్రికెటర్ తో పాటు అతడి కుమారుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్కుమార్ (Praveen Kumar) ప్రయాణిస్తున్న కారును మంగళవారం రాత్రి ఓ ట్రక్కు ఢీ కొట్టింది.
ఉత్తరప్రదేశ్ మీరట్లోని కమీషనర్ నివాసానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రవీణ్కుమార్ పాటు కారులో అతడి కుమారుడు సైతం ఉన్నాడు. ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. సీటు బెల్ట్ పెట్టుకోవడంతో పాటు ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో ఇద్దరూ ప్రాణాలతో పడ్డారని,ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు మీరట్ ఎస్పీ పీయూష్ కుమార్ తెలిపారు.
Ajit Agarkar : భారత క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్గా అజిత్ అగార్కర్
కాగా.. ఈ ఘటనపై ప్రవీణ్కుమార్ ఓ ప్రకటనను విడుదల చేశారు. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో కజిన్ను వదిలిపెట్టి తిరిగి ఇంటికి వెలుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్పాడు. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు తాము ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టినట్లు వెల్లడించాడు. అయితే.. దేవుడి దయ వల్ల ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిపాడు. ప్రమాదం జరిగిన సమయంలో మొదట కారు బంపర్ మాత్రమే దెబ్బతిందని బావించాను అయితే కారు చాలా దారుణంగా దెబ్బతిందని చెప్పాడు.
2007 నుంచి 2012 మధ్య టీమ్ఇండియాకు ప్రవీణ్కుమార్ ప్రాతినిధ్యం వహించాడు. 68 వన్డేల్లో 77 వికెట్లు, 6 టెస్టుల్లో 27 వికెట్లు, 10 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో 119 మ్యాచులు ఆడిన ప్రవీణ్కుమార్ 90 వికెట్లు పడగొట్టాడు. అన్ని రకాల క్రికెట్కు గుడ్బై చెప్పిన ప్రవీణ్ ప్రస్తుతం పలు వ్యాపారాలు చేస్తున్నాడు.