IND vs PAK : భారత్‌ వర్సెస్ పాక్‌ మధ్య నేడు బిగ్‌ ఫైట్‌.. ఒక్క మ్యాచ్‌.. ఎన్నో అంచనాలు! ఇరు జట్ల బలాబలాలు ఇవే..

IND vs PAK : హాకీ ప్రపంచ కప్‌ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది.

Hockey World Cup 2026

  • హాకీ ప్రపంచకప్‌లో నేడు భారత్‌–పాక్‌ మ్యాచ్
  • నాకౌట్‌ బెర్త్‌పై ఉత్కంఠ!
  • భారత్‌కు డ్రా.. పాక్‌కు విజయం తప్పనిసరి!

IND vs PAK : ఆట ఏదైనా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య పోరంటే ఇరు దేశాల అభిమానుల్లోనేకాక ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. ఎక్కువగా క్రికెట్ క్రీడలో ఇరు జట్లు తలపడుతుంటాయి.. ప్రస్తుతం హాకీ ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో ఇరు జట్ల మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్ ను వీక్షించేందుకు క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Also Read : AUS vs BAN : బంగ్లా చేతిలో ఓట‌మి.. దెబ్బ‌కు ఓపెన‌ర్‌ను మార్చేసిన ఆసీస్‌.. మూడేళ్లు టెస్టులు ఆడ‌ని ప్లేయ‌ర్‌కు చోటు..

బుధవారం సాయంత్రం జరిగే పూల్‌-డీ మ్యాచ్‌లో ఇరు జట్లకూ కీలక సమరం కానుంది. భారత్‌ కనీసం డ్రా సాధిస్తే తదుపరి రౌండ్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ ప్రయాణాన్ని కొనసాగించాలంటే తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు పాకిస్థాన్, భారత్ జట్లు సమఉజ్జీలుగా ఉండేవి. కానీ, గత దశాబ్ద కాలంలో రెండు జట్ల మధ్య అంతరం పెరిగింది. భారత్ ప్రపంచ మేటి జట్లలో ఎదగగా.. పాకిస్థాన్ బాగా బలహీనపడింది. గత పదేళ్లలో భారత్, పాకిస్థాన్ చేతిలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ క్రమంలో నేడు జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుపై ఘనవిజయం సాధించి ఫామ్ అందుకోవాలని హర్మన్ ప్రీత్ సేన చూస్తోంది.

భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్ కు నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్‌వీన్‌లో ఉన్న చారిత్రక వాగ్నర్‌ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ బుధవారం సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రారంభం కానుంది. భారత్‌–పాకిస్థాన్‌ పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియం పూర్తిగా నిండిపోనుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ హాకీ ప్రత్యర్థిత్వంలో ఈసారి ప్రపంచకప్‌ నాకౌట్‌ ఆశలు కూడా ముడిపడి ఉండటంతో మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది.

భారత్‌ తన తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై 3–1తో విజయం సాధించింది. అయితే రెండో పూల్‌-డీ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో 2–4తో ఓడింది. మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో 2–1 ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. రెండో అర్ధభాగంలో ఇంగ్లండ్‌ మూడు గోల్స్‌ చేయడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది.

పూల్‌-డీలో భారత్‌ ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉంది. పాకిస్థాన్‌ మాత్రం ఇప్పటివరకు ఆశించిన ఫలితాలు సాధించలేదు. భారత్‌పై విజయం సాధిస్తేనే పాక్‌ తదుపరి దశకు వెళ్లే అవకాశాలను సజీవంగా ఉంచుకోగలదు. భారత్‌ మాత్రం కనీసం డ్రా సాధిస్తే రెండో రౌండ్‌కు చేరే అవకాశం ఉంటుంది.