ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా అసాధారణ ప్రదర్శన చేసింది. వరుసగా 10 మ్యాచుల్లో విజయం సాధించిన భారత జట్టు ఆఖరి మ్యాచులో పట్టు సడలించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్ మినహా మిగతా టోర్నీ మొత్తం టీమ్ఇండియా ఆధిపత్యం కొనసాగించింది. ఇక టీమ్ఇండియా విజయాల్లో భారత పేసర్ మహ్మద్ షమీ ప్రధాన పాత్ర పోషించాడు.
టోర్నీ ఆరంభంలో టీమ్ఇండియా ఆడిన మొదటి నాలుగు మ్యాచుల్లో షమీకి చోటు దక్కలేదు. అయితే.. హర్దిక్ పాండ్య గాయపడడంతో షమీకి తుది జట్టులో చోటు దక్కింది. తనకు వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతీ మ్యాచులో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఏడు మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. షమీ ప్రదర్శన అభిమానులను మంత్ర ముగ్థులను చేసింది.
ప్రపంచకప్ ముగిసి దాదాపుగా నెలరోజులు కావస్తున్నప్పటికీ అభిమానులు షమీ ప్రదర్శనను అంత త్వరగా మరిచిపోలేదు అనడానికి ఇదే నిదర్శనం. షమీ చూసేందుకు అతడికి ఫామ్ హౌస్కు అభిమానులు క్యూ కడుతున్నారు. ఆదివారం షమీని కలుసుకునేందుకు కార్లు, బైకుల మీద షమీ ఫామ్ కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో భద్రతను పెంచారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షమీ పోస్ట్ చేయగా వైరల్గా మారింది.
చీలమండల గాయంతో ఇబ్బంది పడుతున్న షమీ..
ఇదిలా ఉంటే షమీ చీలమండల గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు ఇటీవల ఓ నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ అనంతరం ఆసీస్తో జరిగిన టీ20 సిరీస్ నుంచి అతడికి విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో టీమ్ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది. టెస్టు సిరీస్కు షమీని ఎంపిక చేశారు. అయితే.. ఫిట్నెస్ సాధిస్తేనే అతడు ఆడతాడని జట్టు ప్రకటన సమయంలోనే బీసీసీఐ తెలిపింది.