IND vs SA : రెండో టెస్టులో విజయం దిశగా సౌతాఫ్రికా.. ఇంకో 8 వికెట్లు.. తడబడుతున్న భారత బ్యాటర్లు..
గౌహతి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా (IND vs SA) విజయం దిశగా దూసుకువెలుతోంది.
- Thota Vamshi Kumar
- Published On : November 25, 2025 / 04:10 PM IST
IND vs SA 2nd Test Day 4 Stumps Team India need 522 runs to win match
IND vs SA : గౌహతి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం దిశగా దూసుకువెలుతోంది. 549 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (2), కుల్దీప్యాదవ్ (4) లు క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించడానికి ఆఖరి రోజు 8 వికెట్లు అవసరం కాగా.. భారత్ గెలవాలంటే 522 పరుగులు చేయాల్సి ఉంది.
భారత బ్యాటర్ల తడబాటు కొనసాగుతూనే ఉంది. 549 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. ఓ సిక్స్, ఓ ఫోర్ కొట్టి ఊపుమీద కనిపించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ 13 పరుగులకే ఔట్ అయ్యాడు. మార్కో జాన్సెస్ బౌలింగ్ షాట్ కు యత్నించగా బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో భారత్ 17 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది.
AUS vs ENG : రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు గుడ్న్యూస్..
ఇక మరికాసేపటికే ఆరంభం నుంచి ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ (6) స్పిన్నర్ సైమన్ హార్మర్ బంతిని అంచనా వేయడంలో విఫలమైన క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్తో కలిసి వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. పిచ్ స్పిన్కు సహకరిస్తుండడంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ పిచ్పై ఆఖరి రోజు మొత్తం టీమ్ఇండియా బ్యాటర్లు ఆడి మ్యాచ్ను డ్రా చేసుకుంటే గొప్ప విషయంగానే చెప్పవచ్చు.
అంతకముందు నాలుగో రోజు 26/0 ఓవర్నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సఫారీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ (94; 180 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. టోని డి జోర్జి (49), రికెల్టన్ (35), వియాన్ ముల్డర్ (35 నాటౌట్) లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లలో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగులు చేసింది. ఆ తరువాత భారత్ 201 పరుగులకు ఆలౌటైంది. దీంతో 288 పరుగుల ఆధిక్యం సఫారీలకు లభించింది.
