Virat Kohli 500th international match
IND vs WI : ట్రినిడాడ్ వేదికగా నేటి నుంచి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమవుతోంది. మామూలుగా అయితే ఈ మ్యాచ్ ను పెద్దగా ఎవ్వరు పట్టించుకునే వారు కాదు. అయితే ఈ మ్యాచ్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భారత్, విండీస్ జట్ల మధ్య ఇది వందో టెస్టు మ్యాచ్ కాగా.. విరాట్ కోహ్లి(Virat Kohli)కి 500వ మ్యాచ్ కావడం విశేషం.
అంతర్జాతీయ క్రికెట్లో ఓ ఆటగాడు 500 మ్యాచ్లు ఆడడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. భారత జట్టు తరుపున ఈ ఘనత అందుకోనున్న నాలుగో ఆటగాడిగా కోహ్లి నిలవనున్నాడు. ఇప్పటి వరకు కోహ్లి 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20 మ్యాచ్లు ఆడాడు. నేటి నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్తో రెండో టెస్టు మ్యాచ్తో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 500వ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో పరుగులు యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పై భారత మాజీ క్రికెటర్లు వసీమ్ జాఫర్, ఆకాశ్ చోప్రా తదితరులు ప్రశంసల జల్లు కురిపించారు. అటు బీసీసీఐ కూడా ప్రత్యేకంగా ఓ పోస్టర్ను రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Emerging Asia Cup : సాయి సుదర్శన్ అజేయ సెంచరీ.. పాక్ పై భారత్ విజయం
500 reasons to admire the journey!
Congratulations to Virat Kohli on his 5️⃣0️⃣0️⃣th international match for #TeamIndia 🇮🇳🫡#WIvIND | @imVkohli pic.twitter.com/Y9lez80Q97
— BCCI (@BCCI) July 20, 2023
డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్టులో విరాట్ కోహ్లి (76) శతకం చేయడంలో విఫలం అయ్యాడు. ప్రస్తుతం అతడు ఫామ్లోనే ఉండడంతో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతర్జాతీయంగా క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు. అయితే.. శతకాల విషయంలో మాత్రం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తరువాతి స్థానంలోనే కొనసాగుతున్నాడు.
‘ఆట పట్ల విరాట్ కోహ్లికి ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనం. 16 ఏళ్ల కెరీర్లో తనకు తానుకు తప్పుకున్నాడే తప్ప ఫిట్నెస్ విషయంలో ఇబ్బంది పడి ఒక్క మ్యాచ్కు కూడా దూరం అయిన సందర్భాలు లేవు. అంతలా ఫిట్నెస్ మెయింటేన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. క్రికెట్కు బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. 500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి శుభాకాంక్షలు చెబుతున్నా.’ అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
‘500 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే అవకాశం అందరికి రాదు. నిరంతరం కష్టపడే కోహ్లికి ఆ ఛాన్స్ వచ్చింది. ఇప్పటికే తాను ఏంటో అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 75 శతకాలు చేయడం అంటే సాధారణ విషయం అయితే కాదు. అతడి క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పానికి నిదర్శనం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లకు అతడు ఆదర్శం.’ అని వసీం జాఫర్ తెలిపాడు.
భారత జట్టు వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న మూడో జట్టు విండీస్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ఇప్పటికే ఆ మైలురాయిని అందుకున్నాయి.