Asia Cup 2023: ఆసియాకప్ ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు ఎన్నిసార్లు తలపడ్డాయో తెలుసా? ఎవరిది పైచేయి అంటే..
భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు 1984లో ఆసియా కప్ ఫైన్ల్లో తొలిసారి పోటీ పడ్డాయి. అప్పుడు టోర్నమెంట్ యూఏఈలో జరిగింది. అయితే శ్రీలంకపై భారత్ విజయం సాధించి తొలిసారి ఆసియా కప్ గెలుచుకుంది.
- Harishth Thanniru
- Published On : September 15, 2023 / 09:02 AM IST
Asia Cup 2023
India vs Sri Lanka in Asia Cup 2023: ఆసియా కప్ 2023 టోర్నీ తుదిదశకు చేరింది. సూపర్ -4లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి భారత్ పైనల్కు దూసుకెళ్లగా.. భారత్ జట్టును ఫైనల్లో ఢీకొట్టేందుకు శ్రీలంక, పాకిస్థాన్ జట్లు గురువారం తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో శ్రీలంక జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి పాకిస్థాన్కు షాకిచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్ను 42 ఓవర్లకు కుదించగా.. చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పాకిస్థాన్ ఇంటిబాట పట్టింది. ఆదివారం భారత్, శ్రీలంక జట్లు ఫైనల్ లో తలపడనున్నాయి.
ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు పాకిస్థాన్, భారత్ జట్లు ఫైనల్లో తలపడలేదు. ఈసారి ఆ రెండు జట్లు ఫైనల్లో తలపడతాయని భావించిన క్రికెట్ ఫాన్స్కు పాకిస్థాన్ ఓటమి కొంత నిరాశను మిగిల్చింది. ఈనెల 17న సాయంత్రం కొలంబో వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇదిలాఉంటే ఇప్పటి వరకు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ – శ్రీలంక జట్లు ఎనిమిది సార్లు తలపడ్డాయి. 17వ తేదీన 9వసారి ఇరు జట్లు ఫైనల్ లో అమితుమీ తేల్చుకోనున్నాయి.
Asia Cup 2023: ఫైనల్కు దూసుకెళ్లిన ఇండియా.. శ్రీలంక వర్సెస్ భారత్ మ్యాచ్ ఫొటోలు..
భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు 1984లో ఆసియా కప్ ఫైనల్లో తొలిసారి పోటీ పడ్డాయి. అప్పుడు టోర్నమెంట్ యూఏఈలో జరిగింది. అయితే శ్రీలంకపై భారత్ విజయం సాధించి తొలిసారి ఆసియా కప్ గెలుచుకుంది. ఆ తరువాత 1988, 1991, 1995ల్లో జరిగిన వరుస టోర్నీల్లో ఇరు జట్లు ఫైనల్లో తలపడ్డాయి. వరుసగా టీమిండియానే విజేతగా నిలిచింది. 1997లోనూ శ్రీలంక వర్సెస్ భారత్ జట్లు ఫైనల్లో తలపడగా.. శ్రీలంక విజయం సాధించింది. ఆ తరువాత 2004, 2008, 2010 సంవత్సరాల్లోనూ భారత్ – శ్రీలంక జట్లు ఆసియా కప్ టోర్నీ ఫైనల్లో తలపడ్డాయి. 2004, 2008లో శ్రీలంక జట్టు విజయం సాధించగా. 2010లో టీమిండియా విజయం సాధించింది. 2010 తరువాత ఐదు సార్లు ఆసియా కప్ టోర్నీ జరిగినా ఇరు జట్లు ఫైనల్లో తలపడలేదు. తాజాగా ఆసియా కప్ 2023లో మరోసారి భారత్ , శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
ఆసియా కప్ చరిత్రలో మొత్తం ఎనిమిది సార్లు శ్రీలంక – భారత్ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఐదు సార్లు టీమిండియా విజయం సాధించగా.. మూడు సార్లు శ్రీలంక జట్టు విజయం సాధించింది. ఆసియా కప్ చరిత్రలో టీమిండియా ఏడుసార్లు టోర్నీ విజేతగా నిలిచింది. శ్రీలంక ఆరు సార్లు టోర్నీ విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఆసియా 2023 టోర్నీ విజేతగా నిలిచేందుకు భారత్, శ్రీలంక జట్లు పట్టుదలతో ఉన్నాయి.
