DC vs RCB : ఢిల్లీపై విజయం తరువాత కోహ్లీ కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం తరువాత ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 28, 2025 / 08:47 AM IST
Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఏడు విజయాలతో 14 పాయింట్లతో ఆర్సీబీ కొనసాగుతోంది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) లు రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, కృనాల్ పాండ్యాలు చెరో వికెట్ సాధించారు.
అనంతరం 163 లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73 నాటౌట్ ), విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 51) లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయంలో తన వంతు పాత్ర పోషించిన కోహ్లీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు.
DC vs RCB : బెంగళూరు పై అందుకే ఓడిపోయాం.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కామెంట్స్.. లేదంటేనా?
Virat Kohli said, “T20 cricket isn’t just about coming and hitting boundaries. You need to adapt to the situations and play accordingly”. pic.twitter.com/KqIVbMIgaP
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2025
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఈమ్యాచ్లో విజయం సాధించడంతో ఎంతో ఆనందంగా ఉందన్నాడు. టీ20 క్రికెట్ అంటే వచ్చి రావడంతో బౌండరీలు కొట్టడం కాదన్నాడు. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ఆడాలన్నాడు.
‘పిచ్ను బట్టి చూస్తే మాకు ఇది అత్యుత్తమ విజయం. ఎందుకంటే ఇక్కడ మేము కొన్ని మ్యాచ్లను చూశాము. వాటితో పోలిస్తే పిచ్ భిన్నంగా ఉంది. ఎప్పుడైనా సరే లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినప్పుడు మేము సరైన మార్గంలో వెలుతున్నామో లేదో అని డగౌట్తో తనిఖీ చేస్తూనే ఉంటాను. నా రోల్ ఏంటి అనేది అడిగి తెలుసుకుంటుంటాను. అని కోహ్లీ తెలిపాడు.
‘ప్రజలు భాగస్వామ్యాల ప్రాముఖ్యను మరిచిపోయారు. టీ20 అంటే వచ్చి రావడంతోనే బౌండరీలు కొట్టడం కాదు. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగినట్లుగా ఆడాలి. అందుకనే నేను సింగిల్స్, డబుల్స్ తీయడం మరిచిపోను. దాని వల్ల స్టైట్ రొటేట్ అవుతూ భాగస్వామ్యాలను నిర్మించవచ్చు.’ అని కోహ్లీ అన్నాడు.
2016 తరువాత కృనాల్ పాండ్యా చేసిన తొలి అర్థ శతకం ఇదే. కృనాల్ ఇన్నింగ్స్ పై మాట్లాడుతూ.. ఈ రోజు కృనాల్ ది అని చెప్పాడు. అతడు చాలా బాగా ఆడాడని అన్నాడు. అతడు ఏం చేయగలడో తమకు తెలుసునని, మ్యాచ్లో తాము ఏం చేయాలన్నది స్పష్టంగా మాట్లాడుకున్నట్లు చెప్పాడు.
కోహ్లీ ఔట్ అయిన తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ కేవలం ఐదు బంతుల్లో 19 పరుగులు చేసి విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఫినిషర్ల గురించి మాట్లాడుతూ.. కోహ్లీ ఇలా అన్నాడు. టిమ్ డేవిడ్లో మాకు అదనపు బలం. జితేష్ కూడా ఉన్నాడు. ఆఖరిలో ఇలాంటి హిట్టర్లు ఉండడం జట్టుకు ఎంతో లాభం చేకూరుస్తుందన్నాడు. ప్రస్తుతం టీమ్ బాగుంది. మేము 10 మ్యాచ్ల్లో ఏడు గెలిచాము. ఇదే ఊపును కొనసాగిస్తాం. ఇక భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ ప్రపంచ స్థాయి బౌలర్లు అని మెచ్చుకున్నాడు. ఇక సుయాష్ శర్మ ను మరిచిపోవద్దని, అతడు డార్క్ హార్స్ కాగలడని చెప్పుకొచ్చాడు. అతడు వికెట్లు తీయపోవచ్చు కానీ పరుగులు కట్టడి చేస్తాడని అన్నాడు.
