Ambati Rayudu
Ambati Rayudu-CPL : టీమ్ఇండియా మాజీ ఆటగాడు, తెలుగు తేజం అంబటి రాయుడు (Ambati Rayudu) ఇటీవలే ఐపీఎల్ (IPL) తో పాటు అన్ని రకాల క్రికెట్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో రాయుడుని ఇక గ్రౌండ్లో చూడలేమని, అతడి బ్యాటింగ్ విన్యాసాలు మిస్ అవుతామని ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురి అయ్యారు. తాజాగా వారందరికి శుభవార్త చెప్పాడు అంబటి రాయుడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ఆడనున్నట్లు వెల్లడించాడు.
తాజాగా రాయుడు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్తో ఒప్పందం చేసుకున్నాడు. దీంతో సీపీఎల్ ఆడనున్న రెండో భారత క్రికెటర్గా రాయుడు నిలవనున్నాడు. అతడి కంటే ముందు ప్రవీణ్ తంబె ఈ లీగ్లో ఆడాడు. ఈనెలాఖరులో సీపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. అయితే.. బీసీసీఐ తీసుకురానున్న కొత్త నిబంధన రాయుడు సీపీఎల్లో ఆడేందుకు అడ్డంకుగా మారే అవకాశం ఉంది.
కూలింగ్ ఆఫ్ పీరియడ్ రూల్ ను బీసీసీఐ తీసుకురావాలని చూస్తోంది. ఈ నిబంధన ప్రకారం భారత క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికిన తరువాత సంవత్సరం పాటు.. ఇతర దేశాలు నిర్వహించే ఎటువంటి ప్రాంచైజీ లీగుల్లో భాగస్వామ్యం కావొద్దు. ఈ రూల్ను కొందరు మాజీ ఆటగాళ్లు తప్పుపడుతున్నారు. దీంతో ఈ కొత్త రూల్పై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఆ మధ్య రూల్ వస్తుందన్న కారణంతో అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టీ20 టోర్నీలో అంబటి రాయుడు ఆడలేదు. అయితే.. బీసీసీఐ ఈ కొత్త నిబంధనపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో సీపీఎల్ ఆడాలని రాయుడు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
MS Dhoni: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ధోనీ బ్యాట్.. వేలంలో రికార్డు ధర.. ఆ డబ్బులు ఏం చేశారంటే?