IPL 2026: అసలు ఐపీఎల్ జరుగుతుందా? ఇదో పెద్ద సమస్య వచ్చి పడిందే.. ఇప్పుడెలా?
మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Updated on- March 14, 2026 / 11:00 AM IST
Iran Israel War Poses Threat To Indian Premier League 2026
- మార్చి 28 ప్రారంభం కానున్న ఐపీఎల్
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
- సమయానికి విదేశీ ఆటగాళ్లు చేరుకునేనా?
IPL 2026 : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. అయితే.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్కు ఇబ్బందులు తప్పేలా లేవు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు భారత్కు చేరుకోవడంపైనే ప్రస్తుతం ఫ్రాంఛైజీలు అన్ని దృష్టి సారించాయి. ఉద్రిక్తతల కారణంగా పలు కీలక ప్రాంతాల్లో వాయు మార్గాలను మూసి వేసిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్ల ఐపీఎల్ ప్రారంభ సమయానికి జట్టుతో కలుస్తారో లేదోనన్న టెన్షన్ పలు ఫ్రాంఛైజీల్లో నెలకొంది. మరోవైపు దేశంలో గ్యాస్ కొరత ఐపీఎల్ జట్లకు ఆతిథ్యమిచ్చే హోటళ్లకు సవాల్గా మారనుంది.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలిచింది. అయితే.. ఈ మెగాటోర్నీలో పాల్గొన్న పలు జట్లు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా స్వదేశానికి వెళ్లేందుకు ఆలస్యమైంది. ముఖ్యంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వంటి జట్లు కొన్ని రోజుల పాటు కోల్కతాలోనే ఉండిపోయాయి. గురువారం నాటికి గానీ అన్ని జట్లు తమ స్వస్థలాలకు వెళ్లలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కోసం విదేశీ ఆటగాళ్లు ఎప్పుడు భారత్కు చేరుకుంటారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
The Hundred 2026 : ది హండ్రెడ్ 2026 వేలం తురువాత.. ఏ జట్టులో ఎవరు ఉన్నారంటే?
మిగిలిన దేశాల ప్లేయర్ల సంగతి ఎలా ఉన్నా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ ప్రారంభ సమయానికి భారత్ కు వస్తారా? లేదా ? అన్న దానిపై పలు ఫ్రాంఛైజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాల రూట్ మార్చడం వల్ల విమాన ప్రయాణ ఖర్చు పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఆటగాళ్ల రాకపోకలను సమన్వయం చేయడం అనేక ఫ్రాంచైజీలకు సవాలుగా మారింది.
విడుతల వారీగా షెడ్యూల్..
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ను విడుతల వారీగా ప్రకటిస్తామని ఇప్పటికే బీసీసీఐ తెలిపింది. అన్నట్లుగానే 20 మ్యాచ్లతో తొలి దశ షెడ్యూల్ను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల, అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మిగిలిన షెడ్యూల్ను రూపొందించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఎన్నికలు, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఐపీఎల్ వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. వీటిపై బీసీసీఐ స్పందించింది. అవన్నీ రూమర్లేనని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ను నిర్వహించి తీరుతామని స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లు జరుగుతాయని చెప్పింది.
