Ishan Kishan – Rahul Dravid : టీమ్ఇండియా ఆటగాడు ఇషాన్ కిషన్ తన చేజేతులా తన కెరీర్ను పాడుచేసుకుంటున్నాడా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మానసిక ఒత్తిడి కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్ దూరంగా ఉన్నాడు. అయితే.. అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ ఆడాలని భావించినప్పటికీ అతడిని సెలక్టర్లు పట్టించుకోలేదు. బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించి అతడు దుబాయ్లో పార్టీలకు వెళ్లాడని, దీంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారనే వార్తలు వచ్చాయి.
దీనిపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే స్పందించారు. అలాంటిదేమీ లేదని కొట్టి పారేశాడు. కాగా.. మానసిక ఒత్తిడితో దూరమైన ఇషాన్.. దేశవాలీ క్రికెట్లో ఆడి తిరిగి టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవాలని మీడియా ముఖంగా అతడికి సూచించాడు. అతడు దేశవాలీ క్రికెట్ ఆడేందుకే అఫ్గాన్తో సిరీస్కు ఎంపిక చేయలేదని ద్రవిడ్ స్పష్టం చేశాడు.
ఈ క్రమంలో ఇషాన్ ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఆడతాడని అంతా భావించారు. అయితే.. రంజీల్లో ఆడడం ఇషాన్కు ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. అతడు రంజీల్లో ఆడేందుకు ఇంత వరకు తమను సంప్రదించలేదని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ‘ఇషాన్ ఆడే విషయమై మాకు స్పష్టత లేదు. అతడు రంజీల్లో ఆడుతానని ఇంత వరకు చెప్పలేదు. ఒకవేళ అతడు ఆడతానని చెబితే మాత్రం నేరుగా తుది జట్టులోకి తీసుకుంటాం.’ అని జార్ఖండ్ క్రికెట్ బోర్డు కార్యదర్శి చక్రవర్తి తెలిపారు.
ఇంగ్లాండ్తో జనవరి 25 నుంచి భారత్ ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు కేఎల్ రాహుల్ను స్పెషలిస్ట్ బ్యాటర్గానే పరిగణించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్, కేస్ భరత్ పేర్లను పరిశీలిస్తోంది.
Rohit Sharma : భలే భలే మగాడివోయ్..! అతడి పేరును ఎలా మర్చిపోయావ్ రోహిత్ భయ్యా?
అయితే.. దేశవాలీ క్రికెట్ ఆడాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినప్పటికీ ఇషాన్ లెక్కచేయడం లేదు. ఈ క్రమంలో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు అతడి ఎంపిక కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తన కెరీర్ను అతడే ప్రమాదంలోకి నెట్టుకుంటున్నాడని అంటున్నారు. చూడాలి మరీ ఇషాన్ ఇప్పటికైనా రంజీలు ఆడి టీమ్ఇండియాలో చోటు దక్కించుకుంటాడో లేదో