Legal notice to Sreesanth
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ చిక్కుల్లో పడ్డాడు. అతడికి లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సి) నిర్వాహకులు లీగల్ నోటీసులు పంపారు. కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఉల్లగించడంతో అతడికి ఈ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతున్న భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ మధ్యలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. గొడవలో తన తప్పేమీ లేదని, గంభీరే తనను ఫిక్సర్ అని అన్నాడని చెప్పాడు. ఘటనపై శ్రీశాంత్ సోషల్ మీడియా వేదికగా వీడియోలు పెట్టాడు.
ఈ వీడియోలపై ఎల్ఎల్సీ నిర్వాహకులు స్పందించారు. శ్రీశాంత్ వీడియోలు పెట్టడంపై ఎల్ఎల్సీ నిర్వాహకులు అసహనం వ్యకం చేశారు. అతడు కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లంగించినట్లు పేర్కొన్నారు. దీంతో అతడికి లీగల్ నోటీసులు పంపించినట్లు తెలిపారు. అంతేకాకుండా గంభీర్ను దూషించే వీడియోలను తొలగించిన తర్వాత మాత్రమే పేసర్తో చర్చలు ప్రారంభమవుతాయని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు చెప్పారు.
కాగా.. ఈ వివాదానికి సంబంధించి ఫీల్డ్ అంపైర్ల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. తమతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఆటగాళ్లు అందరూ కూడా ఒప్పందాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.
మరో పోస్ట్ చేసిన శ్రీశాంత్..
గంభీర్-శ్రీశాంత్ల మధ్య రెండు రోజుల క్రితం వాగ్వాదం జరిగిన ఘటనను ఇంకా మరువకముందే శ్రీశాంత్ చేసిన మరో పోస్ట్ వైరల్గా మారింది. గురువారం రెండో క్వాలిఫయర్ మ్యాచులో ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఇండియా క్యాపిటల్స్ కెప్టెన్ అయిన గౌతమ్ గంభీర్ను మణిపాల్ ఆటగాడు అమితోజ్ సింగ్ రనౌట్ చేశాడు. దీనిపై శ్రీశాంత్ స్పందిస్తూ అద్భుతమైన త్రో వేశావు. వెల్డన్ అమితోజ్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేశాడు. ఇది కూడా వైరల్గా మారింది. గంభీర్ పై కోపంతోనే శ్రీశాంత్ అమితోజ్ను ప్రశంసించాడంటూ నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు.