IND vs NZ : అందుకే మేం ఓడిపోయాం.. ఆ ఒక్క పని చేసుంటేనా.. కివీస్ కెప్టెన్ బ్రేస్వెల్ కామెంట్స్
భారత్ చేతిలో తొలి వన్డే మ్యాచ్లో (IND vs NZ ) ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్ వెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : January 12, 2026 / 07:59 AM IST
Michael Bracewell comments after New Zealand lost 1st ODI against India
- తొలి వన్డేలో భారత్ విజయం
- ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్ వెల్ కామెంట్స్
- ఆఖరి వరకు పోరాడాం
IND vs NZ : మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్లో దాదాపు చివరి వరకు న్యూజిలాండ్ గట్టిగా పోరాడింది. దీనిపై న్యూజిలాండ్ తాత్కాలిక సారథి మైఖేల్ బ్రేస్వెల్ మాట్లాడుతూ.. ఓడిపోయినప్పటికి మ్యాచ్ ను చివరి ఓవర్ వరకు తీసుకువెళ్లడం గొప్పగా ఉందన్నాడు. బ్యాటింగ్లో తాము మరో 20 నుంచి 30 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరో రకంగా ఉండేదన్నాడు.
‘మా ప్రయత్నం పట్ల మేము గర్వపడుతున్నాము. ప్రపంచ నంబర్ 1 జట్టును ఆఖరి ఓవర్ వరకు ఒత్తిడిలో ఉంచాము. ఇది ఎల్లప్పుడూ సంతోషాన్నిచ్చే విషయం.’ అని బ్రేస్వెల్ అన్నాడు. ఈ మ్యాచ్లో తాము కొన్ని తప్పిదాలను చేశామని, వాటిని సరిదిద్దుకోవాల్సి ఉందన్నాడు. తాము 20 నుంచి 30 పరుగులు అంటే 320 లేదా 330 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరో రకంగా ఉండేదన్నాడు.
Virat Kohli : అర్ష్దీప్ సింగ్ రన్నింగ్ ను అనుకరించిన కోహ్లీ.. వీడియో వైరల్
అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు
గాయం నుంచి కోలుకుని వచ్చిన జేమీసన్ అద్భుతంగా బౌలింగ్ వేశాడని మెచ్చుకున్నాడు. ఇది తమకు అతి పెద్ద సానుకూల అంశం అని చెప్పుకొచ్చాడు. తమ బ్యాటింగ్ విభాగం ఎంతో అనుభం ఉందన్నాడు. గత కొంత కాలంగా మిచెల్ నిలకడగా ఆడుతున్నాడని తెలిపాడు. బ్యాటింగ్లో ఆఖరి ఓవర్లో తాము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఆసక్తికరంగా ఉండేదన్నాడు.
‘మ్యాచ్లో చాలా వరకు మా నియంత్రణలో ఉన్నప్పటికి కూడా.. కొన్ని అవకాశాలను చేజార్చుకున్నాము. ఇక భారత్లో లైట్ల కింద ఆడడం ఎప్పుడూ అంత సులభం కాదు. మేము మాకు చాలా ఉన్నత ప్రమాణాలను నిర్దేశించుకున్నాము. దాని కోసం మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాము.’ అని బ్రేస్వెల్ అన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డారెల్ మిచెల్ (84; 71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (62; 69 బంతుల్లో 8 ఫోర్లు), డెవాన్ కాన్వే (56; 67 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ లు తలా రెండు వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం విరాట్ కోహ్లీ (93; 91 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో భారత్ లక్ష్యాన్ని 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిగిలిన బ్యాటర్లలో శుభ్మన్ గిల్ (56; 71 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (49; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (29 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), హర్షిత్ రాణా (29; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ లు చెరో వికెట్ సాధించారు.
