MS Dhoni : రెండు రోజుల క్రితం తన ఫేస్బుక్ పోస్ట్లో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. కొత్త సీజన్.. కొత్త పాత్ర కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే ఇందుకు సంబంధించిన అప్డేట్ను ఇస్తాను అని ధోని ఆ పోస్ట్లో రాసుకొచ్చాడు. దీంతో అతడు సీఎస్కే కెప్టెన్గా తప్పుకోనున్నాడని మెంటర్గా కొనసాగనున్నాడని కొందరు, ఆటకు వీడ్కోలు చెబుతాడని మరికొందరు ఇలా జోరుగా చర్చలు సాగాయి.
ఇక ధోనిని మైదానంలో చూడలేమని కొందరు అభిమానులు ఎంతో బాధపడ్డారు. తాజాగా ధోని కొత్త పాత్రకు సంబంధించిన విషయం తెలిసిపోయింది. కొందరు ఊహించినట్లుగానే అతడు ఓ యాడ్ కోసం ఈ పోస్ట్ చేసినట్లుగా స్పష్టమైంది. ఐపీఎల్ 17వ సీజన్ అధికారిక బ్రాడ్ కాస్టర్ అయిన జియో సినిమాస్ రూపొందించిన ఓ యాడ్లో ధోని సరికొత్త పాత్రలో కనిపించాడు.
42 ఏళ్ల ధోని ఈ యాడ్లో ద్విపాత్రాభినయం చేశాడు. యువకుడి పాత్రతో పాటు ఓ వృద్ధుడి పాత్రను పోషించాడు. తెల్లని వెంట్రుకలతో పాటు మీసాలతో మొబైల్లో జియో సినిమాస్ యాప్లో క్రికెట్ చూస్తుండగా వృద్ధుడి పాత్రలో ఉన్న ధోనికి గుండెపోటు వస్తుంది. అతడిని అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకువెలుతుతండగా.. నొప్పితోనే వృద్ధుడి పాత్రలో ఉన్న ధోని, యువకుడి పాత్రలో ఉన్న ధోనితో పాటు అంబులెన్స్లో ఉన్న మరొకరు సైతం మ్యాచ్ను చూస్తూ ఉంటారు.
కాగా.. ఈ యాడ్ వీడియోను ధోనీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. జియో సినిమాని ట్యాగ్ చేస్తూ “ కొత్త సీజన్, ద్విపాత్రాభినయం! మార్చి 22 నుండి #IPLonJioCinemaతో అన్ని చర్యలు మీకు పూర్తిగా ఉచితంగా అందించబడతాయి. క్యుంకీ సబ్ యహాన్, ఔర్ కహాన్!” అంటూ రాసుకొచ్చాడు. మొత్తంగా ఐపీఎల్ మ్యాచ్లు అన్నింటిని జియో సినిమాస్ యాప్లో ఉచితంగా చూడొచ్చునని చెప్పుకొచ్చాడు.
మరో టైటిల్ గెలుస్తాడా..?
చెన్నై సూపర్ కింగ్స్కు ఐదు ఐపీఎల్ టైటిల్స్తో పాటు రెండు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను అందించాడు ఎంఎస్ ధోని. అతడి సారథ్యంలో 14 సీజన్లలో చెన్నై ఆడగా 12 సార్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. గతేడాది అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ను ఓడించి చెన్నై ఛాంపియన్గా నిలిచింది. ఈ క్రమంలో ఈ సీజన్లోనూ విజేతగా నిలిచి ఆరో టైటిల్ను అందుకుని ఐపీఎల్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఏకైక కెప్టెన్గా ధోని నిలవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.
కాగా.. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం వేదికగా జరగనుంది.