Hockey : భారత హాకీ జట్టుపై కోట్ల వర్షం.. ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్ని పతకాలు గెలిచిందో తెలుసా?
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థి జట్టు స్పెయిన్ తో తలపడిన భారత్ జట్టు.. 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
- Harishth Thanniru
- Published On : August 9, 2024 / 06:59 AM IST
indian hockey team
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థి జట్టు స్పెయిన్ తో తలపడిన భారత్ జట్టు.. 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 30వ నిమిషంలో, 33వ నిమిషంలో రెండు గోల్స్ చేసి భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు చారిత్రాత్మక విజయం తరువాత భారత హాకీ ఆటగాళ్లపై బహుమతుల వర్షం కురుస్తోంది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ హాకీ జట్టుకు భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీ ప్రకటించాడు.
ఒడిశా నుంచి వచ్చిన భారత హాకీ జట్టు డిఫెండర్ అమిత్ రోహిదాస్ కు రూ. 4కోట్ల ఫ్రైజ్ మనీని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జట్టులో మిగిలిన ప్రతి ఆటగాడికి రూ. 15లక్షలు, సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 10లక్షలు ఇవ్వనున్నట్లు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. అమిత్ రోహిదాస్ ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో జన్మించాడు. 2013 నుంచి భారత సీనియర్ హాకీ జట్టుకు డిఫెండర్ గా ఆడుతున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత జట్టులో అమిత్ కూడా భాగస్వాముడు. అతను హాకీ జట్టులో డిఫెండర్. తన కెరీర్ లో 184 మ్యాచ్ ఆడుతూ 28 గోల్స్ కూడా చేశాడు. మరోవైపు ప్లేయర్స్ కు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. ఒక్కో ప్లేయర్ కు రూ. 15లక్షలు, సిబ్బందికి 7.5లక్షల చొప్పున నజరానా ప్రకటించింది.
Also Read : Paris Olympics : పారిస్ ఒలింపిక్స్లో మరో పతకం.. కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు
ఒలింపిక్స్ చరిత్రలో హాకీలో భారత్ కు ఇప్పటి వరకు 13 పతకాలు దక్కాయి. భారత హాకీ జట్టు 1928-80 మధ్య ఏకంగా ఎనిమిది స్వర్ణ పతకాలు, ఓ రజత పతకం, రెండు కాంస్య పతకాలు సాధించింది. ఆ తరువాత తన వైభవాన్న కోల్పోతూ వచ్చింది. గత ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన భారత్ జట్టు.. ఈసారికూడా అదే పతకాన్ని సాధించింది.
ఒలింపిక్స్ చరిత్రలో భారత హాకీ జట్టు 1928, 1932, 1936, 1948, 1952, 1956,1964, 1980 సంవత్సరాల్లో స్వర్ణ పతకాలను సాధించగా.. 1960లో రజత పతకం దక్కించుకుంది. 1968, 1972, 2020, 2024 సంవత్సరాల్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది.
