Pakistan cricketers order biriyani
Pakistan : వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ ప్రయాణం ఎలాగున్నప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు మాత్రం భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రుచులను మాత్రం చాలా చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఈ మెగాటోర్నీ కోసం హైదరాబాద్కు వచ్చిన తరువాత పాక్ ఆటగాళ్లు హైదరాబాదీ బిర్యానీ తిని ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బంగ్లాదేశ్తో మ్యాచ్ కోసం కోల్కతాలో ఉన్న పాకిస్థాన్ జట్టు తాజాగా అక్కడి ఫేమస్ వంటకాలు అయిన కోల్కతా బిర్యానీ, కబాబ్లు, చాప్లను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తినింది.
బంగ్లాదేశ్తో మ్యాచ్ కోసం పాక్ జట్టు శనివారం కోల్కతా చేరుకుంది. కాగా.. కోల్కతాలోని ప్రసిద్ధ బిర్యానీ తినాలని భావించిన టీమ్ హోటల్లో డిన్నర్ను క్యాన్సల్ చేసుకుంది. ప్రయాణ పరిమితుల కారణంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా ప్రసిద్ధ జామ్ జామ్ రెస్టారెంట్ నుంచి ఆదివారం ఆహారాన్ని ఆర్డర్ చేసింది.
జామ్ జామ్ రెస్టారెంట్ డైరెక్టర్ షాద్మాన్ ఫైజ్ మాట్లాడుతూ.. మొదట ఈ ఆర్డర్ పాకిస్తాన్ క్రికెట్ జట్టు నుండి వచ్చిందని తమకు తెలియదని చెప్పారు. ఆ తరువాత తెలిసిందన్నారు. కోల్కతాకు తనదైన శైలి బిర్యానీ ఉందని, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిందన్నారు. ‘బిరియానీ, కబాబ్లు, చాప్ అనే మూడు వంటకాలను వారు ఆర్డర్ చేశారు. ఆదివారం రాత్రి ఏడు తర్వాత ఆర్డర్ చేశారు. మొదట్లో.. ఈ ఆర్డర్ పాకిస్తాన్ క్రికెట్ జట్టు నుండి అని మాకు తెలియదు. తర్వాత మాకు అది తెలిసింది. వారు ఆహారాన్ని ఇష్టపడ్డారని నేను ఆశిస్తున్నాను.’ అని షాద్మాన్ చెప్పారు.
దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. హైదరాబాదీ బిర్యానీ బాగుందా లేదంటే కోల్కతా బిర్యానీనా..? అని కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో పాకిస్థాన్ తలపడుతోంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మహ్మదుల్లా(56; 70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. లిట్టన్ దాస్ (45) షకీబ్ అల్ హసన్ (43), మెహిదీ హసన్ మిరాజ్(25) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిం జూనియర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. హరీస్ రవూఫ్ 2 వికెట్లు తీశాడు. ఇఫ్తికార్ అహ్మద్, ఉసామా మీర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Mohammed Shami : దిగ్గజాల రికార్డుకు అడుగుదూరంలో షమీ.. ఇదే ఫామ్తో ఇంకొక్క మ్యాచ్ ఆడితే..
ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ తో మ్యాచ్తో పాటు మిగిలిన రెండు మ్యాచుల్లోనూ పాకిస్థాన్ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు కూడా నేరుగా సెమీస్కు చేరేందుకు అవకాశాలు లేదు. మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.