హనుమాన్ జయంతి వేళ హైదరాబాద్లో ఇవాళ శోభాయాత్ర జరిగింది. ఈ సందర్భంగా సినీనటి, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా తాడ్బండ్ వీరాంజనేయస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
శనివారం హైదరాబాద్లోని ఉప్పల్లో సన్రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. దీంతో ప్రీతి జింటా హైదరాబాద్ వచ్చి అలాగే హనుమాన్ స్వామివారిని దర్శించుకున్నారు. తన జట్టు గెలవాలని కోరుకున్నారు. మందిరానికి వచ్చిన సందర్భంగా ఆమె ముఖానికి మాస్క్ ధరించడం గమనార్హం.
మరోవైపు, పంజాబ్ కింగ్స్తో నేడు జరగనున్న మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్కి ఎంతో కీలకం. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు ఓడింది. ఇవాళ మ్యాచ్ ఓడితే ప్లేఆఫ్ ఆశలు సన్నగిల్లుతాయి.
కాగా, “నువ్వు నీలా ఉండు.. మీ నేపథ్యం, సంస్కృతి, కుటుంబం పట్ల గర్వపడు” అని అంటున్నారు ప్రీతి జింటా. ఇటీవల పంజాబ్లో జరిగిన మ్యాచులో ఆమె సాంప్రదాయ భారతీయ దుస్తులు ధరించి కనపడ్డారు. ఆమె దుస్తులు అందరినీ ఆకర్షించాయి. తన ఫొటోలను ఇవాళ ప్రీతి జింటా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. చాలా సింపుల్గా ట్రెడిషనల్ లుక్లో ఆమె కనపడిన తీరు చాలా బాగుందని పంజాబ్ జట్టు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.