Rahul Dravid : ఐపీఎల్లోకి రాహుల్ ద్రవిడ్ రీ ఎంట్రీ..? ఆ జట్టుకు మెంటార్గా..?
Rahul Dravid future : టీమ్ఇండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగిసింది. అయితే.. భారత క్రికెట్ కోచ్గా అతడు మళ్లీ కొనసాగుతాడా..? లేదా అన్న అంశం పై ఇంకా స్పష్టత రాలేదు.
- Thota Vamshi Kumar
- Published On : November 25, 2023 / 05:03 PM IST
Rahul Dravid
టీమ్ఇండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగిసింది. అయితే.. భారత క్రికెట్ కోచ్గా అతడు మళ్లీ కొనసాగుతాడా..? లేదా అన్న అంశం పై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై ఇప్పటి వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే.. రిపోర్టుల ప్రకారం ద్రవిడ్ ను మరో ఏడాది పాటు కోచ్గా కొనసాగాలని బీసీసీఐ కోరినా ఇందుకు అతడు సముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో మరో వార్త తెరపైకి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్కు లక్నో సూపర్ జెయింగ్స్ (ఎల్ఎస్జీ) ద్రవిడ్ను మెంటార్గా నియమించు కునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఒకవేళ భారత జట్టుకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరించాలని అనుకుంటే మాత్రం లక్నోతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉండదు. అందుకు నిబంధనలు అంగీకరించవు. అయితే.. ద్రవిడ్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్లో భాగస్వామ్యం అయితే అతడికి ఎక్కువ సమయం లభిస్తుంది.
కాగా.. గత రెండేళ్లుగా లక్నో మెంటార్గా సేవలు అందించిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడు తిరిగి కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)గూటికి చేరుకున్నాడు. కేకేఆర్ కు ఏడేళ్ల పాటు గంభీర్ కెప్టెన్గా ఉన్నాడు. అతడి నాయకత్వంలో కేకేఆర్ 2012, 2014లో ఐపీఎల్ విజేతగా నిలిచింది.
ఆసియా కప్ మినహా..
2021 టీ20 ప్రపంచకప్ ఓటమి తరువాత అప్పటి టీమ్ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి నుంచి ఆ బాధ్యతలను రాహుల్ ద్రవిడ్ అందుకున్నాడు. వాస్తవానికి ఈ పదవిని చేపట్టేందుకు ద్రవిడ్ కు పెద్దగా ఇష్టం లేదు. నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలు ఇద్దరూ కలిసి రాహుల్ ద్రవిడ్ను ఒప్పించి మరీ ఈ బాధ్యతలను తీసుకునేలా చేశారు.
ద్రవిడ్ మార్గనిర్దేశంలో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ద్వైపాకిక్ష సిరీస్ల్లో అద్భుతమైన విజయాలు సాధించింది. అయితే.. టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్, వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్ మ్యాచులో ఓటమి పాలైంది. కాగా.. ఆసియా కప్ను మాత్రం సొంతం చేసుకుంది.
Rohit Sharma : ఐపీఎల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎసరు..? కొత్త కెప్టెన్ అతడేనా..?
ద్రవిడ్ తన కాంట్రాక్ట్ పొడిగింపునకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం అప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడని వార్తలు వస్తున్నాయి. అతడు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి మార్గనిర్దేశంలోనే భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది.
