Rashid Khan comments : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ పై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. రహ్మానుల్లా గుర్భాజ్(80; 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇక్రమ్ అలీఖిల్ (58; 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు అర్థశతకాలతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది.
అయితే.. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు అనూహ్యంగా తడబడింది. అఫ్గాన్ స్పిన్నర్లు ముజీబ్ ఉర్ రహ్మాన్(3/51), రషీద్ ఖాన్ (3/37), మహ్మద్ నబి (2/16) ల ధాటికి 40.3 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (66; 61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే పోరాడారు. బెయిర్ స్టో (2), బట్లర్ (9), జో రూట్ (11), లివింగ్ స్టోన్ (10) లు దారుణంగా విఫలం కావడంతో ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి తప్పలేదు.
ఢిల్లీ ప్రేక్షకుల మద్దతు అపూర్వం..
ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో చాలా మంది భారత అభిమానులు అఫ్గానిస్థాన్ జట్టుకు మద్దతుగా నిలిచారు. తమ జట్టుకు లభించిన మద్దతుపై రషీద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఢిల్లీ ప్రజలు నిజమైన ప్రేమను కలిగి ఉన్నారన్నాడు. ఢిల్లీ ప్రజల ప్రేమ అద్భుతం అని చెప్పాడు. మైదానానికి వచ్చి మద్దతుగా నిలిచిన అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాడు. స్టేడియంలో లభించిన మద్దతే ముందుకు సాగడానికి దోహదపడిందన్నారు. ఈ సందర్భంగా మద్దతు ఇచ్చిన అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ODI World Cup 2023: వరల్డ్ కప్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేసుకున్న ఇంగ్లాండ్.. అదేంటో తెలుసా?
Delhi sach mein dil walon ki hai 🙌
A huge thank you to all the fans at the stadium who supported us and kept us going through out the game 🙏
And to all our supporters around the 🌍 thank you for your love 💙
— Rashid Khan (@rashidkhan_19) October 16, 2023
ఈ విజయం ప్రజల ముఖాల్లో చిరునవ్వు తెప్పిస్తుంది..
ఇంగ్లాండ్ జట్టుపై భారీ విజయం సాధించడంపై మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ మాట్లాడాడు. ఇంగ్లాండ్ పై తమ జట్టు విజయం సాధించడం తమ దేశ ప్రజల ముఖాల్లో చిరునవ్వు తెప్పిస్తుందని, భూకంపం తరువాత వారు పడుతున్న బాధను కొంతైనా తగ్గిస్తుందన్నాడు. ఇంగ్లాండ్ పై విజయం సాధించడం జట్టులో ఉత్సాహాన్ని నింపిందని, ఇదే జోష్లో ప్రపంచకప్లో మిగిలిన మ్యాచుల్లోనూ గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు.
ODI World Cup 2023 : పాకిస్థాన్తో మ్యాచ్.. గోల్డ్ మెడల్ అందుకుంది ఎవరో తెలుసా..?
కాగా.. అఫ్గానిస్థాన్లో ఇటీవల భూకంపం సంబంధించింది. ఈ భూకంపం కారణంగా దాదాపు 1000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.