Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఓ మ్యాచ్లో విజయం సాధిస్తే మరో మ్యాచ్లో ఓటమి అన్నట్లుగా ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టు 9 మ్యాచ్లు ఆడగా ఐదు మ్యాచ్ల్లో గెలిచింది. మరో నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఐడెన్ మార్క్రమ్ (52) హాఫ్ సెంచరీ చేశాడు. మిచెల్ మార్ష్ (45), ఆయుష్ బదోని (36) లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, చమీర చెరో వికెట్ సాధించారు.
Kl Rahul : చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీల రికార్డులు బ్రేక్..
ఆ తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్ పోరల్ (51), కేఎల్ రాహుల్ (57 నాటౌట్) లు హాఫ్ సెంచరీలు బాదగా.. అక్షర్ పటేల్ (34 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లలో మార్క్రమ్ రెండు వికెట్లు తీశాడు.
మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. ఈ పిచ్ పై టాస్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాడు. అయినా ఓటమికి సాకులు వెతకడం లేదన్నాడు. తాము ఈ మ్యాచ్లో ఓ 20 పరుగులు తక్కువగా చేశామన్నాడు.
‘ఈ పిచ్ పై ఎవరు ముందుగా బౌలింగ్ చేసినా వికెట్ నుంచి మంచి సాయం దొరుకుతుంది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు ఎక్కువగా సహకరిస్తుంటుంది. లక్నోలో ఇలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. టాస్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయినా మేం సాకులు వెతకడం లేదు.’ అని రిషబ్ పంత్ అన్నాడు.
‘మయాంక్ మైదానంలో అడుగుపెట్టేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. అతడు ఇప్పుడే ఎన్సీఏ నుంచి వచ్చాడు. ఆయుష్ బదోని బాగా ఆడుతున్నాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉంటాయి. ఈ క్రమంలోనే సమద్ను ముందు పంపాము. ఆ తరువాత మిల్లర్ ను బరిలోకి దించాము. అయినప్పటికి మేం ఆశించిన విధంగా జరగలేదు. గెలిచేందుకు ఉత్తమ కాంబినేషన్ను కనుగొనేందుకు ప్రయత్నించాలి.’ అని పంత్ తెలిపాడు.