India vs West Indies ODI Series : వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్లో రోహిత్-కోహ్లీ ఆ పెద్ద మైలురాయిని సాధిస్తారా?
విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మొత్తం 274 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 57.32 సగటుతో 13,776 పరుగులు చేశాడు. ఇందులో 46 సంచరీలు ఉన్నాయి.
- Harishth Thanniru
- Published On : July 26, 2023 / 07:29 AM IST
IND vs WI ODI series
IND vs WI ODI Match: వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్ ను భారత్ 1-0తో కైవసంచేసుకుంది. ప్రస్తుతం వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఈనెల 27న(గురువారం) బార్బడోస్లో జరుగుతుంది. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసేందుకు భారత్ జట్టు పట్టుదలతో ఉంది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని భావించిన భారత్ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. అయితే, వన్డే సిరీస్ నైనా క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. వన్డే సిరీస్లో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు భారీ రికార్డులపై కన్నేశారు. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే ఫార్మాట్లో4,998 పరుగుల భాగస్వామ్యం చేశారు. మరో రెండు పరుగులు జోడిస్తే వన్డే ఫార్మాట్లో ఐదు వేల పరుగుల భాగస్వామ్యం నెలకొంటుంది.
ఐదు వేల పరుగుల భాగస్వామ్యాన్ని రోహిత్, కోహ్లీ జోడీ పూర్తిచేస్తే అతితక్కువ మ్యాచ్లలో 5వేల పరుగులు పూర్తిచేసిన జోడీగా రోహిత్, కోహ్లీ జోడీ నిలుస్తుంది. ఈ ఇద్దరు కలిపి 85 వన్డేల్లో 4,998 పరుగులు జోడించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వన్డే ఫార్మాట్ లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య 15 సార్లు సెంచరీ భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా సగటు 62.47గా ఉంది. వన్డే ఫార్మాట్ లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య 18సార్లు యాబైకిపైగా పరుగుల భాగస్వామ్యం ఉంది. ఇద్దరు ఆటగాళ్ల వన్డే కెరీర్ను పరిశీలిస్తే.. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 243 వన్డే మ్యాచ్ లు ఆడాడు. వీటిలో 48.64 సగటుతో 10,914 పరుగులు చేశాడు. వీటిలో 30 సంచరీలు కూడా ఉన్నాయి. 48సార్లు యాబై పరుగుల మార్క్ ను రోహిత్ దాటాడు.
విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మొత్తం 274 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 57.32 సగటుతో 13,776 పరుగులు చేశాడు. ఇందులో 46 సంచరీలు ఉన్నాయి. 65 సార్లు యాబైకి పైగా పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్ లో కోహ్లీకి అద్భుత రికార్డు ఉంది. 50 సంచరీలు చేసేందుకు కోహ్లీకి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. వెస్టిండీస్ జట్టుతో జరిగే మూడు వన్డే మ్యాచ్ లలో కోహ్లీ సెంచరీలతో విరుచుకుపడితే వన్డే ఫార్మాట్లో 50 సెంచరీల మార్క్ కు మరింత చేరువకు చేరుకున్నట్లవుతుంది.
వెస్టిండీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ల షెడ్యూల్ ..
– జూలై 27న తొలి వన్డే (కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్)
– జూలై 29న రెండో వన్డే ( కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్)
– ఆగస్టు 1న మూడో వన్డే (క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్)
