India vs South Africa : రెండోసారి టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకునేందుకు భారత జట్టు అడుగుదూరంలో ఉంది. శనివారం బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. స్థానిక కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10.30 గంటలకు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ రోజు ఆట సాధ్యం కాకపోయినా ఎలాంటి నష్టం లేదు. రిజర్వ్ డే అయిన ఆదివారం మ్యాచ్ను నిర్వహించనున్నట్లు ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఎలాగైనా టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఉన్నారు. కాగా.. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో 34 పరుగులు చేస్తే.. ఈ పొట్టి ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. హిట్మ్యాన్ ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్ల్లో 41.33 సగటు 155.97 స్ట్రైక్రేటుతో 248 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీల ఉన్నాయి. 22 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అఫ్గానిస్తాన్ కీలక ఆటగాడు రహ్మానుల్లా గుర్భాజ్ ఉన్నాడు. అతడు ఎనిమిది ఇన్నింగ్స్ల్లో 124.34 స్ట్రైక్రేటుతో 281 పరుగులు చేశాడు.
మరో మూడు వికెట్లు తీస్తే..
ప్రస్తుతం టీమ్ఇండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా పేసర్ అర్ష్దీప్ సింగ్ కొనసాగుతున్నాడు. 7 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. ఈ పొట్టి ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మరో మూడు వికెట్లు తీస్తే అఫ్గానిస్తాన్ బౌలర్ ఫారుఖీ వెనక్కి నెట్టి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవనున్నాడు. ఫారుఖీ 8 మ్యాచుల్లో 17 వికెట్లు పడగొట్టాడు.
పదేళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో టీమిండియా.. ఇండియన్స్, సఫారీల సమరంలో గెలుపెవరిది?