Sarfaraz Khan : శ్రీలంకతో టెస్టు సిరీస్కు పిలుపు.. సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ రియాక్షన్ వైరల్..
చాలా కాలం తరువాత భారత జట్టు పిలుపు అందుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan).
- Thota Vamshi Kumar
- Published on- August 10, 2026 / 11:10 AM IST
Sarfaraz Khan First Post On Social Media After India Call Up For Sri Lanka Test Series
Sarfaraz Khan : చాలా కాలం తరువాత భారత జట్టు పిలుపు అందుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. సర్ఫరాజ్ ఇప్పటి వరకు భారత్ తరఫున ఆరు టెస్టు మ్యాచ్లు ఆడాడు. 37.1 సగటుతో 371 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్థశతకాలు ఉన్నాయి.
దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ కొంతకాలంగా జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న అతడికి తాజా ఎంపిక ఊరటనిచ్చింది. చాలా కాలం తరువాత జట్టులో చోటు దక్కడంతో సర్ఫరాజ్ ఖాన్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. టీమ్ఇండియా ట్రెవెలింగ్ జెర్సీ ధరించిన ఫోటోలను అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఓ ఫోటోలో అతడు తన తండ్రితో కలిసి కనిపించాడు.
మరోవైపు ఎడమచేతి వాటం బ్యాటర్ సాయి సుదర్శన్ గత నెలలో జరిగిన భారత్-ఎ పర్యటన సందర్భంగా కాలికి గాయమైంది. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతడు కోలుకుంటున్నాడు. గాయం నుంచి సుదర్శన్ వేగంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. అతడిని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పుకొచ్చింది.
ఆగస్టు 15న నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. నేడు లేదా రేపు సర్ఫరాజ్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. 28 ఏళ్ల సర్ఫరాజ్ చివరిసారిగా 2024లో న్యూజిలాండ్తో ముంబైలో జరిగిన టెస్టులో భారత్ తరఫున ఆడాడు. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా భారత జట్టులో ఉన్నప్పటికీ ఐదు మ్యాచ్ల్లో ఒక్కదానిలోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. అలాగే 2025లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్-ఎ జట్టులోనూ సర్ఫరాజ్ ఉన్నాడు. అయితే ఆ పర్యటనలో ప్రధాన భారత టెస్టు జట్టులో అతడికి చోటు దక్కలేదు.
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో ఉంది. శ్రీలంకపై జరగనున్న టెస్టు సిరీస్లో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు.
శ్రీలంకతో టెస్టు సిరీస్కు అప్డేట్ చేసిన భారత జట్టు ఇదే..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవ్దత్ పడిక్కల్, సారాంశ్ జైన్, అకిబ్ నబీ, సర్ఫరాజ్ ఖాన్.
