Smriti Mandhana : శ్రీలంకతో ఐదో టీ20 మ్యాచ్.. భారీ రికార్డుపై స్మృతి మంధాన కన్ను.. గిల్ ను అధిగమించేనా?
ఐదో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) సరికొత్త రికార్డు సృష్టించే ఛాన్స్ ఉంది.
- Thota Vamshi Kumar
- Published On : December 30, 2025 / 11:39 AM IST
Smriti Mandhana need 62 runs in INDW vs SLW T20 match to surpass shubman gill in this tally
Smriti Mandhana : భారత, శ్రీలంక మహిళల జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా నేడు (డిసెంబర్ 30న) ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఆఖరిదైన చివరి టీ20 మ్యాచ్లోనూ విజయం సాధించి క్లీన్స్వీప్ చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి కాస్త పరువునైనా దక్కించుకోవాలని శ్రీలంక జట్టు ఆరాటపడుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) సరికొత్త రికార్డు సృష్టించే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది మంధాన అన్ని ఫార్మాట్లలో కలిపి 1703 పరుగులు సాధించింది. ఆఖరి మ్యాచ్లో 62 పరుగులు చేస్తే 2025 ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచే ఛాన్స్ ఉంది.
Harleen Deol : బీచ్లో ఎంజాయ్ చేస్తున్న భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్
ఈ క్రమంలో ఆమె టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శుభ్మన్ గిల్ను అధిగమిస్తుంది. గిల్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో 1764 పరుగులు చేశాడు. ఇప్పటికే ఈ ఏడాది మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా మంధాన కొనసాగుతోంది.
శ్రీలంక సిరీస్లో మంధాన పెద్దగా రాణించలేదు. తొలి మూడు మ్యాచ్ల్లో విఫలమైంది. అయితే.. తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో మాత్రం అద్భుతంగా ఆడింది. 48 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 80 పరుగులతో ఫామ్ అందుకుంది.
