ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. బారికేడ్లు తోసేసిన అభిమానులు

టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదని ఆరోపిస్తూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

SRH v CSK: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్ ఉండడంతో క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి ఏడున్నరకు ప్రారంభమయ్యే మ్యాచ్ చూసేందుకు సాయంత్రం 4.30 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నారు.

టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదని ఆరోపిస్తూ గేట్ నంబర్ 4 వద్ద అభిమానులు బారికేడ్లని తోసేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులకు, ప్రేక్షకులకు మధ్య వాగ్వాదం.. తోపులాట చోటుచేకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఒక్కొక్కరినీ లోపలికి పంపిస్తున్నారు.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివస్తుండడంతో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ధోని ఆట చూసేందుకు అభిమానులు పోటెత్తారు. మరోవైపు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మెట్రో, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి.

Also Read: ‘బోలే జో కోయల్’ అంటూ పాట పాడిన ఎంఎస్ ధోని.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు