Sri Lankan Coach : క్రికెట్ మ్యాచ్లో విషాదం.. ఆటగాళ్ల ఘర్షణలో మాజీ కోచ్ మృతి
కొలంబోలో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి 62 ఏళ్ల క్రికెట్ కోచ్ (Sri Lankan Coach) సుమిత్ ఫెర్నాండో చికిత్స పొందుతూ మరణించారు.
- Thota Vamshi Kumar
- Updated on- August 13, 2026 / 09:55 PM IST
Sri Lankan Coach Dies In Hospital After Clash With Players During Match
Sri Lankan Coach : శ్రీలంక క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొలంబోలో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి 62 ఏళ్ల క్రికెట్ కోచ్ సుమిత్ ఫెర్నాండో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుశాల్ మెండిస్కు పాఠశాల స్థాయిలో కోచ్గా వ్యవహరించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఆగస్టు 8న ఒక క్రీడా ప్రాంగణంలో శిక్షణ పొందుతున్న కొంతమంది యువ క్రికెటర్లు తాగునీటి కోసం వెళ్లగా, అక్కడ నీటి వసతి అందుబాటులో లేదు. ఈ విషయంపై ఆటగాళ్లకు, స్టేడియం సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న, బ్లూమ్ఫీల్డ్ క్రికెట్ & అథ్లెటిక్ క్లబ్లో క్యూరేటర్గా కూడా పనిచేసిన ఫెర్నాండో.. పరిస్థితి ముదిరిపోవడంతో జోక్యం చేసుకున్నారు.
అనంతరం ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఫెర్నాండో గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం కొలంబో జాతీయ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు.
ఈ ఘటనకు సంబంధించి 17 ఏళ్ల పాఠశాల క్రికెటర్ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కొలంబో కోర్టులో హాజరుపరచగా.. ఆగస్టు 17 వరకు బాలల ప్రొబేషన్ కస్టడీకి పంపించారు.
మొరటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీలో మాజీ కోచ్గా పనిచేసిన ఫెర్నాండో.. పలువురు పాఠశాల స్థాయి క్రికెటర్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన శిక్షణ ఇచ్చిన వారిలో ఒకరైన మెండిస్.. ఆ తర్వాత శ్రీలంక వన్డే కెప్టెన్గా ఎదిగారు. అనంతరం ఫెర్నాండో.. శ్రీలంక దేశీయ క్రికెట్ వ్యవస్థలో ఒక ప్రముఖ క్లబ్ అయిన బ్లూమ్ఫీల్డ్ క్రికెట్ & అథ్లెటిక్ క్లబ్లో గ్రౌండ్స్ క్యూరేటర్గా పనిచేశారు.
