Arshdeep Singh : సారీ అశ్విన్ భాయ్..! మాజీ స్పిన్నర్కు క్షమాపణ చెప్పిన అర్ష్దీప్ సింగ్.. కారణమేంటంటే?
Arshdeep Singh : భారత యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తాజాగా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు క్షమాపణలు చెప్పాడు.
- Harish Thanniru
- Published on- August 4, 2026 / 08:58 AM IST
Star India pacer Arshdeep Singh apologised to Ravichandran Ashwin
Arshdeep Singh : భారత యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తాజాగా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు క్షమాపణలు చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో అశ్ భాయ్ సారీ.. నేను ఎందుకు అలా అనాల్సి వచ్చిందో మీకు వ్యక్తిగతంగా మెసేజ్ చేసి కూడా క్షమాపణ చెబుతానని సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అర్ష్దీప్ సింగ్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో టీమిండియాలో టాప్-5 బౌలర్లను ఎంపిక చేయాలని కోరడంతో.. అర్ష్దీప్ ఐదుగురు బౌలర్లను ఎంచుకుంటాడు. తన జాబితాలో మొదటి స్థానంలో భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేశాడు. భువనేశ్వర్ కుమార్ నా వ్యక్తిగత ఫేవరెట్ అని, అందుకే కొంచెం పక్షపాతం చూపించాను అని చెప్పాడు. రెండో స్థానంలో మహ్మద్ షమీ, మూడో స్థానంలో కుల్దీప్ యాదవ్, నాలుగో స్థానంలో యుజ్వేంద్ర చాహల్, ఐదో స్థానంలో రవిచంద్ర అశ్విన్ తన ఫేవరెట్ బౌలర్లు అంటూ అర్ష్దీప్ పేర్కొన్నాడు.
అయితే, రవిచంద్ర అశ్విన్ను తన ఫేవరెట్ బౌలర్లలో ఐదో స్థానంలో ఎంపిక చేయడంపై అర్ష్దీప్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పాడు. అశ్విన్ భాయ్ను ఐదో స్థానంలో ఉంచాలని నా ఉద్దేశం కాదు. అప్పటికే మిగతా స్థానాలన్నీ నిండిపోయాయి. ఆయన గొప్ప బౌలర్. అంతేకాదు, ఐపీఎల్లో పంజాబ్ జట్టుకు ఆయన కెప్టెన్గా ఉన్నప్పుడు నేను ఆడాను. అందుకే ఆయనకు వ్యక్తిగతంగా మెసేజ్ చేసి సారీ చెబుతాను అని నవ్వుతూ వ్యాఖ్యానించాడు.
ఇదిలాఉంటే.. టీమిండియా ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన అర్ష్దీప్ సింగ్.. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత జట్టుకు ఎంపిక కాలేదు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారత జట్టు తరఫున ఆడిన అర్ష్దీప్కు ఆ తర్వాత జరిగిన జింబాబ్వే టి20 సిరీస్లో చోటు దక్కలేదు.
