Suryakumar Yadav : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్..
టీ20 క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 1, 2025 / 10:53 AM IST
Courtesy BCCI
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో సూర్యకుమార్ 8 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. సోమవారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 27 పరుగులను చేయడం ద్వారా సూర్య ఈ ఘనత సాధించాడు.
టీ20ల్లో 8వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఓవరాల్గా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. టీ20ల్లో వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ 4749 బంతుల్లో 8000 రన్స్ చేయగా.. సూర్య 5256 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
అంతే కాకుండా టీ20ల్లో 8000 రన్స్ సాధించిన ఐదో భారత బ్యాటర్గా సూర్య రికార్డులకు ఎక్కాడు.
సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో 2598 పరుగులు చేశాడు. ఐపీఎల్ మ్యాచ్లలో 3698 పరుగులు చేశాడు. ఇక దేశీయ మ్యాచ్లలో కూడా పరుగులు సాధించాడు. మొత్తం మీద సూర్యకుమార్ యాదవ్ 288 టీ20 మ్యాచ్ లలో 8007 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 54 అర్థశతకాలు ఉన్నాయి.
టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లీ – 12976 రన్స్
రోహిత్ శర్మ – 11851 రన్స్
శిఖర్ ధావన్ – 9797 రన్స్
సురేష్ రైనా – 8654 రన్స్
సూర్యకుమార్ యాదవ్ – 8007 రన్స్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కోల్కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో అంగ్క్రిష్ రఘువంశీ (26), రమణ్దీప్ సింగ్ (22) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ నాలుగు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విష్నేష్ పుతూర్, మిచెల్ సాంట్నర్ లు తలా ఓ వికెట్ సాధించారు.
IPL 2025 : వామ్మో కాస్ట్లీ ప్లేయర్.. సింగిల్ రన్కు రూ.2.7 కోట్లు.. కెప్టెన్సీ ఇవ్వలేదనే..
అనంతరం లక్ష్యాన్ని ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. ర్యాన్ రికెల్టన్ (62 నాటౌట్; 41 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (27 నాటౌట్; 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీశాడు.
