Tokyo Olympics 2020 : కాంస్యాన్ని కోల్పోయిన వారికి బహుమతిగా టాటా కార్లు
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం చేజారిన అథ్లెట్లకు గిఫ్ట్ లు ప్రకటించింది ప్రముఖ కార్ల కంపెనీ టాటా. చివరి వరకు పోరాడి ఓటమి చవిచూసిన అథ్లెట్లకు తమ వాహన శ్రేణిలోని ఆల్ట్రోజ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్కడ ఓడినా.. మా మనసు గెలుచుకున్నారు అని టాటా తెలిపింది
- kunduru Vinod
- Published On : August 13, 2021 / 07:44 PM IST
Tokyo Olympics 2020
Tokyo Olympics 2020 : టోక్యో ఒలిపిక్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి గతంలో ఎన్నడూ తెనన్ని పతకాలు తీసుకొచ్చారు భారత క్రీడాకారులు. పతకం వస్తుందని ఊహించని క్రీడల్లో పతకాలు తీసుకొచ్చారు. వందేళ్ల తర్వాత భారత మాత మేడలో బంగారు పతకం వేశారు. ఒలింపిక్స్ వెళ్లిన అందరు పతకం సాదించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వీరిలో కొందరు పతకాన్ని కొద్దీ దూరంలో వెనుదిరిగారు.
అయితే ఒలింపిక్స్ వరకు చేరడమే గొప్ప విషయం.. అక్కడ పతకం సాధించారా లేదా అన్నది తర్వాతి సంగతి.. దీనిని దృష్టిలో ఉంచుకొనే ఒలింపిక్స్ కి వెళ్లిన క్రీడాకారులకు ఆయా రాష్ట్రప్రభుత్వాలు పారితోషకం అందిస్తున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హాకీ క్రీడాకారిణి రజనీకి రూ.25 లక్షలు రూపాయలు అందించింది. ఇక ఇదిలా ఉంటే దేశంలోని కుబేరులు ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి తమ వంతుగా సాయం చేస్తున్నారు.
తాజాగా మహీంద్రా కంపెనీ గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకి తమ వాహన శ్రేణిలోని ఎక్స్యూవీ 700 ఎడిషన్ కారును బహుమతిగా ఇచ్చింది. ఇదిలా ఉంటే టోక్యో ఒలింపిక్స్ లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత క్రీడాకారులకు టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్కడ ఓడినా.. మా మనసు గెలుచుకున్నారు అని టాటా ప్రకటించింది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. “ఒలింపిక్స్ అంటే కేవలం పతకాలు మాత్రమే కాదు, మన దేశానికి ఈసారి ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లు ఒలింపిక్స్ లో కనబరిచిన కృషిని, స్ఫూర్తిని చూసి మేము సంతోషిస్తున్నాము. ఒత్తిడిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కూడా వారు పతకాన్ని కోల్పోయి ఉండవచ్చు.. కానీ వారు తమ అంకితభావంతో లక్షలాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. ఇది భారతదేశంలో రాబోయే వర్ధమాన క్రీడాకారులకు వారు నిజమైన స్ఫూర్తి” అని అన్నారు.
