Team India Tour Pakistan : 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటించే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023 నిర్వహణ హక్కులను దాయాది దేశ క్రికెట్ బోర్డు దక్కించుకోవడంతో టీమిండియా పాక్ పర్యటన అంశం తెరపైకి వచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పీసీబీకి ఆసియా కప్ 2023 వన్డే ఫార్మాట్ నిర్వహణ బాధ్యతలను అప్పచెబుతూ కౌన్సిల్ తీర్మానం చేసింది. వాస్తవానికి 2020లోనే ఆసియా కప్ను పాక్లో నిర్వహించాల్సి ఉండింది. అయితే అప్పట్లో పాక్ పర్యటనకు బీసీసీఐ ససేమిరా అనడంతో పీసీబీ ఆ బాధ్యతలను శ్రీలంకకు కట్టబెట్టింది.
Read More : IPL 2021 : నడి సముద్రంలో క్రికెట్ ఆడుతూ..ధోనికి శుభాకాంక్షలు
కరోనా కారణంగా శ్రీలంక కూడా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని చేతులెత్తేయడంతో అప్పట్లో టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పాక్ 2023 ఆసియా కప్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ నూతన చైర్మన్ రమీజ్ రాజా దృవీకరించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని సంయుక్తంగా ప్రకటించారు. అన్నీ సజావుగా సాగితే టోర్నీని 2023 జూన్, జులై నెలల్లో నిర్వహించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. టీమిండియా చివరిసారిగా 2006లో పాక్లో పర్యటించింది.