This is the The Story behind ICC Test Championship Mace
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నేటి నుంచే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లండన్లోని లార్డ్స్ మైదానం ఆతిథ్యం ఇస్తున్న ఈ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు టెస్టు ఛాంపియన్ షిప్ గద కోసం పోటీపడుతున్నాయి.
వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ విజేతగా నిలవాలని ఆస్ట్రేలియా భావిస్తోండగా.. తొలిసారి ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకోవాలని దక్షిణాఫ్రికా ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30.8 కోట్ల ప్రైజ్మనీతో పాటు టెస్టు ఛాంపియన్ షిప్ గదను అందిస్తారు. రన్నరప్ జట్టుకు రూ.17.9 కోట్లు ప్రైజ్మనీ దక్కనుంది.
గదను ఇవ్వడం వెనుక కథ ఇదే..
డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన జట్టుకు గదను ఎందుకు ఇస్తారు అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఇలా ఎందుకు ఇస్తారో ఇప్పుడు చూద్దాం..
గతంలో టెస్టుల్లో అగ్రస్థానం దక్కించుకున్న జట్టుకు గదను ఇచ్చేశారు. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ విజేతకు కూడా గదనే బహూకరిస్తున్నారు. ఇక ఈ గదను 2000 సంవత్సరంలోనే ఐసీసీ తయారు చేయించింది. ట్రావెర్ బ్రౌన్ అనే డిజైనర్ దీనిని తయారు చేశారు.
WTC Final : బుధవారమే డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో గెలిచిన జట్టు సభ్యులు స్టంప్స్ను తీసుకుని సంబరాలు చేసుకోవడాన్ని చూస్తూనే ఉంటాం. స్టంప్ను ఆలంబనగా చేసుకుని గదను తయారు చేయడానికి స్ఫూర్తిని పొందినట్లు బ్రౌన్ తెలిపాడు. క్రికెట్లో బాల్ ఎంతో ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. దీన్ని కేంద్ర బిందువుగా చేసుకుని గదను తయారు చేసినట్లుగా వెల్లడించాడు. గద హ్యాండిల్ క్రికెట్ స్టంప్ను సూచిస్తుంది. హ్యాండిల్ చుట్టూ రిబ్బన్ చుట్టి ఉండటాన్ని గమనించవచ్చు. ఇక ఈ రిబ్బన్ విజయానికి చిహ్నంగా భావిస్తారు.