క్రికెట్ అభిమానులు అందరూ ప్రస్తుతం ఐపీఎల్ను ఆస్వాదిస్తున్నారు. ఐపీఎల్ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ జూన్ 2 నుంచి 29 వరకు జరగనుంది. ఈ మెగాటోర్నీకి సంబంధించిన ప్రచారాన్ని ఐసీసీ ఇప్పటికే ప్రారంభించింది. జమైకా పరుగుల చిరుత, ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత ఉసెన్ బోల్ట్ను టీ20 ప్రపంచకప్కు అంబాసిడర్గా ఐసీసీ నియమించింది.
ప్రచారకర్తగా నామినేట్ అయిన అనంతరం బోల్ట్ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్కు అంబాసిడర్గా వ్యవహరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
Rishbh Pant : మ్యాచ్ అనంతరం క్షమాపణ చెప్పిన పంత్.. గొప్ప మనసు అంటూ నెటిజన్ల ప్రశంసలు
20 దేశాలు అర్హత..
టీ20 ప్రపంచకప్ ఆడేందుకు 20 దేశాలు అర్హత సాధించాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో – భారతదేశం, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా, గ్రూప్ Bలో – ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, గ్రూప్ Cలో – న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా, గ్రూప్ Dలో – దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ లు ఉన్నాయి.
మొదట గ్రూపులోని ప్రతీ జట్టు మిగిలిన జట్లతో ఒక్కొ మ్యాచ్ ఆడనుంది. ఆ తరువాత నాలుగు గ్రూప్ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8 దశలో ప్రతీ జట్టుతో ఒక్కొ మ్యాచ్ ఆడతాయి. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సైమీఫైనల్ మ్యాచులు ఆడతాయి. జూన్ 29న బార్బోడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది.