Virat Kohli : దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విజయం.. విరాట్ కోహ్లీ ‘భాంగ్రా’.. వీడియో వైరల్
సిరీస్ సమం కావడంతో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్లు కలిసి ట్రోఫీని అందుకున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : January 4, 2024 / 10:39 PM IST
Virat Kohli Bhangra
Virat Kohli Bhangra : దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. కేప్టౌన్ మైదానంలో గెలిచిన మొదటి ఆసియా జట్టుగా భారత్ రికార్డులకు ఎక్కింది. ఈ విజయంతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ను భారత్ 1-1 తో సమం చేసింది. టీమ్ఇండియా తొమ్మిది సార్లు సౌతాఫ్రికాలో పర్యటించగా రెండో సారి మాత్రమే టెస్టు సిరీస్ను సమం చేసుకుంది. మిగిలిన ఏడు సందర్భాల్లో ఓడిపోవడం గమనార్హం.
సిరీస్ సమం కావడంతో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్లు కలిసి ట్రోఫీని అందుకున్నారు. అనంతరం ఇరు జట్లు కలిసి ట్రోఫీతో ఫోటోలు దిగేందుకు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ భాంగ్రా భంగిమతో సంబరాలు జరుపుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ భాంగ్రా భంగిమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Kohli was ready to do Bhangra ??
This version of Kohli is such a vibe ??❤️ #INDvSA pic.twitter.com/eIbGkmy5pT— ????? (@raahgir_27) January 4, 2024
ఆఖరి టెస్టు ఆడిన ఎల్గర్.. భారత జట్టు కానుక..
కేప్టౌన్ టెస్టు తరువాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు దక్షిణాప్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ సిరీస్ కు ముందే చెప్పిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో చివరి మ్యాచ్ ఆడిన ఎల్గర్కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కానుకలు అందించారు. మ్యాచ్ ముగిసిన తరువాత కోహ్లీ తన జెర్సీని ఇవ్వగా, టీమ్ఇండియా ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని రోహిత్ శర్మ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి.
Spirit of Cricket ?#TeamIndia | #SAvIND pic.twitter.com/MkW3IiPraY
— BCCI (@BCCI) January 4, 2024
ఇక మ్యాచ్ విషయానికి వస్తే… టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్లో భారత్ 153 పరుగులు చేసింది. దీంతో భారత్కు 98 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తరువాత మార్క్రమ్ (106) శతకం సాయంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం తీసివేయగా భారత్ ముందు 79 పరుగుల లక్ష్యం నిలిచింది. 12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా ఈ లక్ష్యాన్ని ఛేదించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 28, రోహిత్ శర్మ 17 నాటౌట్ లు రాణించారు. సఫారీ బౌలర్లలో నాంద్రే బర్గర్, కగిసో రబాడ, మార్కో జాన్సెన్ లు తలా ఓ వికెట్ తీశారు.
