దయచేసి నన్ను అలా పిలవకండి.. ఇబ్బందిగా ఉంది: విరాట్ కోహ్లి
మొదట, మీరు నన్ను ఆ పదంతో పిలవడం మానేయండి. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు.
- Naga Srinivasa Rao Poduri
- Updated on- March 20, 2024 / 11:11 AM IST
Virat Kohli RCB: తనను అలా పిలవడం నచ్చట్లేదంటున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. ఐపీఎల్ 2024 మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి అన్బాక్స్ ప్రోగ్రామ్ నిర్వహించారు. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, ఆర్సీబీ విమెన్ టీమ్ కెప్టెన్ స్మృతి మంధానతో పాటు జట్టు సభ్యులు పాల్గొన్నారు. కోహ్లి ఎంట్రీతో చిన్నస్వామి స్టేడియంలో దద్దరిల్లింది. కింగ్స్ కోహ్లి అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అయితే తనను కింగ్ అని పిలవొద్దని హోస్ట్ డానిష్ సైత్, అభిమానులను కోహ్లి కోరారు. కింగ్ అని పిలిపించుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నాడు. దీని గురించి డు ప్లెసిస్తో కోహ్లి మాట్లాడుతూ.. “మొదట, మీరు నన్ను ఆ పదంతో (కింగ్) పిలవడం మానేయండి. దయచేసి నన్ను విరాట్ అని పిలవండి. నన్ను ఆ పదంతో పిలవొద్దని నేను ఫఫ్ డు ప్లెసిస్తో చెప్పాను. మీరు నన్ను అలా పిలిచిన ప్రతిసారి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి నన్ను విరాట్ అని పిలవండి. దయచేసి ఇక నుంచి నన్ను పిలవడానికి కింగ్ పదాన్ని ఉపయోగించవద్దు. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంద”ని కోహ్లీ అన్నాడు.
స్మృతి మంధాన నాయకత్వంలోని విమెన్ టీమ్ టైటిల్ గెలవడంపై కోహ్లి స్పందించాడు. విమెన్ టీమ్ అద్భుత విజయాన్ని తాము కూడా చూశామని చెప్పాడు. ఐపీఎల్ టైటిల్ నెగ్గి ఆర్సీబీ ట్రోఫీలను డబుల్ చేయడానికి తాము ప్రయత్నిస్తామని అన్నాడు. కాగా, ఈనెల 22న జరిగే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తలపడనుంది.
Also Read: కోహ్లీ నామస్మరణతో దద్దరిల్లిపోయిన చిన్నస్వామి స్టేడియం.. వీడియో వైరల్
