VVS Laxman : టీమ్ఇండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్..! జింబాబ్వే పర్యటనకు..!
భారత జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024లో బిజీగా ఉంది.
- Thota Vamshi Kumar
- Published On : June 21, 2024 / 09:02 AM IST
VVS Laxman to accompany Team India to Zimbabwe
భారత జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024లో బిజీగా ఉంది. పొట్టి ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య జింబాబ్వేతో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. జూలై 6 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. కాగా.. ఈ పర్యటనకు భారత హెడ్కోచ్గా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా.. ఈ పర్యటనకు ప్రపంచకప్లో ఆడిన సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, సిరాజ్, జడేజా అక్షర్లకు జింబాబ్వే పర్యటనకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ బావిస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాళ్లను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లుగా సమాచారం.
ఐపీఎల్ 2024లో సత్తా చాటిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, నితీష్కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లకు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్తో భారత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ చేపట్టింది. కోచ్గా టీమ్ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా.. గంభీర్ శ్రీలంక పర్యటన నుంచి కోచ్గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జింబాబ్వే పర్యటనకు లక్ష్మణ్ హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కాగా.. ద్రవిడ్ గైర్హాజరీలోనూ లక్ష్మణ్ కోచ్గా పలు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. శనివారం లేదా ఆదివారం జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించనున్నారు.
