Gautam Gambhir : గంభీర్కు ఈ సిరీసే ఆఖరిది కానుందా.. సిడ్నీ పరీక్షలో గంభీర్ నెగ్గెనా?
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం హెచ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవికాలం ముగిసింది.
- Thota Vamshi Kumar
- Published On : December 31, 2024 / 09:12 AM IST
Will this series be the last for Gambhir if Sydney Test team india lose
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం హెచ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవికాలం ముగిసింది. ఆ తరువాత ద్రవిడ్ వారసుడిగా ఏరి కోరి మరీ బీసీసీఐ గౌతమ్ గంభీర్ను హెడ్ కోచ్ను చేసింది. ఐపీఎల్లో మెంటార్గా కోల్కతా నైట్రౌడర్స్కు టైటిట్ను అందించిన గౌతమ్ గంభీర్ టీమ్ఇండియా క్రికెట్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెలుతాడని సగటు క్రీడాభిమాని భావించాడు. అయితే.. హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తరువాత భారత జట్టు చరిత్రలో ఎన్నడూ చూడని పరాజయాలను చవిచూస్తోంది.
వన్డేలు, టెస్టులు.. ఇలా ఫార్మాట్తో సంబంధం లేకుండా ఘోర పరాజయాలను మూటగట్టుకుంటోంది. గంభీర్ శ్రీలంక పర్యటనతో కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఆ పర్యటనలో టీ20 సిరీస్ గెలిచినప్పటికి వన్డే సిరీస్లో భారత్ ఓడిపోయింది. సినీయర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడినా భారత్ ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. 27 ఏళ్ల తరువాత భారత జట్టు శ్రీలంకలో వన్డే సిరీస్ ను కోల్పోవడం గమనార్హం.
IND vs AUS 4th test : నాలుగో టెస్టులో భారత్ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం..
ఎంతటి మేటి జట్టుకు అయినా అప్పుడప్పుడు ఇలాంటి పరాభవాలు తప్పవని అభిమానులు సర్దుకుపోతుండగా మరో షాక్ తగిలింది. సొంత గడ్డపై భారత్ టెస్టు సిరీస్ను కోల్పోయింది. అది కూడా న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో వైట్ వాష్ కు గురైంది. 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్ను కోల్పోవడంతో గంభీర్ కోచింగ్ సామర్థ్యం ప్రశ్నలు తలెత్తాయి. అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు గంభీర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
ఘోర ఓటముల నేపథ్యంలో బీసీసీఐ సైతం అలర్ట్ అయింది. గంభీర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా భారత్ కోల్పోతే గంభీర్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమేనన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కోచ్గా అతడు జట్టుకు అందించిన విజయాల కంటే ఘోర ఓటములు ఎక్కువగా ఉండడం అతడి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానున్నటెస్టు మ్యాచ్ ఫలితం పైనే గంభీర్ భవిష్యత్తు ఆధారపడి ఉందని అంటున్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలిచి సిరీస్ను 2-2తో సమం చేస్తే ఓకే గానీ.. ఒకవేళ టీమ్ఇండియా ఓడిపోతే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది. అప్పుడు బీసీసీఐ ఈ ఓటమిని సిరీస్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గంభీర్ను టెస్టు జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. వన్డేలు, టీ20ల్లో ఇప్పడికిప్పుడు అతడి కోచింగ్కు వచ్చిన ముప్పేమీ లేదు.
