Womens World Cup 2025 Team India players pose with World Cup trophy in hotel room
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి తొలిసారి వన్డే ప్రపంచకప్ను టీమ్ఇండియా ముద్దాడింది. దీంతో యావత్ భారత్ సంబరాల్లో మునిగిపోయింది. హర్మన్ సారథ్యంలోని భారత ప్లేయర్లు కూడా ఆనందంలో మునిగితేలుతున్నారు. తాము ప్రపంచకప్ ను సాధించాము అన్న విషయాన్ని వారు ఇంకా నమ్మలేకపోతున్నారు. ఇక ప్రపంచకప్ను పక్కన బెట్టుకుని మరీ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో షెఫాలి వర్మ (78 బంతుల్లో 87 పరుగులు), దీప్తి శర్మ (58 బంతుల్లో 58 పరుగులు) హాఫ్ సెంచరీలు చేయగా స్మృతి మంధాన (45), రిచా ఘోష్ (34) లు రాణించారు. సఫారీ బౌలర్లలో అయబొంగా ఖాకా మూడు వికెట్లు తీసింది.
ఆ తరువాత 299 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ (101) సెంచరీ చేసినా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో సఫారీలకు ఓటమి తప్పలేదు. టీమ్ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ ఐదు వికెట్లు తీసింది. షెఫాలీ వర్మ రెండు వికెట్లు, శ్రీ చరణి ఓ వికెట్ సాధించింది.
ప్రపంచకప్ గెలిచిన తరువాత భారత ప్లేయర్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. తాము బసచేసిన హోటల్లో బెడ్ పై ప్రపంచకప్ను పెట్టుకుని ఫోటోలు దిగారు. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధానతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ గుడ్ మార్నింగ్ అని జెమీమా రోడిగ్స్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. మరో ఫోటోను షేర్ చేస్తూ.. మేం కలలో ఉన్నాం అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.