Wrestlers vs WFI: లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన ఏడుగురు మహిళా రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు (Delhi Police) భద్రత కల్పించారు. ఆ ఏడుగురు మహిళా రెజ్లర్లలో ఓ మైనర్ కూడా ఉంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే.
మూడు నెలలుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో రెజ్లర్లు సుప్రీంకోర్టు (Supreme Court)ను కూడా ఆశ్రయించారు. దీంతో ఎట్టకేలకు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలతో ఇప్పుడు ఆ ఏడుగురు రెజ్లర్లకు పోలీసులు భద్రత కల్పించారు. మరోవైపు, ఒలింపిక్స్ పతక విజేత, రెజ్లర్ యోగేశ్వర్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏడుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణ జరుపుతోన్న కమిటీలో యోగేశ్వర్ దత్ సభ్యుడిగానూ ఉన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఇక రెజ్లర్లు తమ రెజ్లింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు.
“ఫిర్యాదు చేస్తేనే పోలీసులు చర్యలు తీసుకుంటారు. మనం ఇంట్లో కూర్చుంటే పోలీసులు చర్యలు తీసుకోరు. మూడు నెలల క్రితమే రెజ్లర్లు ఫిర్యాదు చేయాల్సింది. నేను ఇంతకుముందే చెప్పాను. చర్యలు తీసుకోవాలంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలనన్నాను” అని యోగేశ్వర్ దత్ అన్నారు.
Wrestlers: రెజ్లర్ల వద్దకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేంద్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు