SSC Exams in Telangana : టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల సమయంలో వాటిని అస్సలు తీసుకెళ్లకండి.. ఈ సూచనలు తప్పక పాటించండి..
SSC Exams in Telangana : తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపటి (ఈనెల 14వ తేదీ) నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 16వ తేదీతో పూర్తవుతాయి.
- Harishth Thanniru
- Published On : March 13, 2026 / 09:45 AM IST
SSC Exams in Telangana
- తెలంగాణలో రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
- ఏర్పాట్లు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు
- పరీక్షల సమయంలో విద్యార్థులు ఈ సూచనలు పాటించాలి
SSC Exams in Telangana : తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపటి (ఈనెల 14వ తేదీ) నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 16వ తేదీతో పూర్తవుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి ఉదయం 11.00 వరకే ఉంటాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 5,17,727 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రానున్నారు. వీరిలో 2,60,916 మంది అబ్బాయిలు కాగా.. 2,56,811 మంది అమ్మాయిలు. వీరితోపాటు గతంలో తప్పినవారు, పరీక్షలకు హాజరుకానివారు 10,512 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలు రాయనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కనీసం అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అయితే, ఈసారి టెన్త్ పరీక్షల విధానంలో కొన్ని మార్పులు చేశారు. వాటిలో ఒకటి ఐదు నిమిషాలు మినహాయింపు. ఉదయం 9.30గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది.. విద్యార్థులను 9.35గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రయాణంలో ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతుంది. పరీక్షా కేంద్రంలో ఓఆర్ఆర్ ప్యాకెట్లు, మంచినీటిని అందుబాటులో ఉంచనున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఇప్పటికే ఉన్నతాధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనుండగా.. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అన్ని చర్యలు చేపట్టారు.
ఈ నిబంధనలు పాటించాలి..
♦ విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. దీంతో ఎలాంటి హడావుడి, టెన్షన్ లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు వీలుంటుంది.
♦ విద్యార్థులు చివరి నిమిషంలో హడావుడి పడకుండా తమ పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందే చూసుకోవాలి.
♦ పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లడం నిషేధం.
♦ హాల్ టికెట్లు లేనిదే పరీక్షకు అనుమతించరు. విద్యార్థులు 80989 58096 నంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా కూడా తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
♦ పాఠశాల గుర్తింపు తెలియకుండా సాధారణ దుస్తుల్లోనే విద్యార్థులు పరీక్షకు రావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
వీటి జోలికి వెళ్లకండి..
♦ టెస్త్ పరీక్షలు రాసే విద్యార్థులు రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండకండి. పరీక్షకు ముందురోజు రాత్రి ఎక్కువగా మేల్కొంటే మరుసటి రోజు పరీక్ష రాసే సమయంలో ఏకాగ్రత దెబ్బతింటుంది.
♦ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. పరీక్షలు ముగిసే వరకు స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలి. ఆ మేరకు తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలి.
♦ ఒక సబ్జెక్టు కష్టంగా ఉంటే భయపడకండి. భయపడడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీకు తెలిసిన అంశాలపై పట్టు సాధించండి.
♦ పరీక్ష పూర్తయిన తరువాత దాని గురించి స్నేహితులతో ఎక్కువ చర్చించకండి. తదుపరి పరీక్షపై దృష్టి పెట్టండి.
♦ పరీక్షల సమయాల్లో సరియైన ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 7 నుంచి 8గంటలు నిద్ర ఉండేలా చూసువాలి.
