తెలంగాణ ఉద్యమం సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని.. అగ్గిపెట్టె లేదని డ్రామాలు ఆడిన హరీశ్ రావు కూడా ఇప్పుడు మేడిగడ్డ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… మేడిగడ్డ కుంగిపోయి 130 రోజులైనా కేసీఆర్ మాట్లాడడం లేదని విమర్శించారు.
మేడిగడ్డపై మాట్లాడడానికి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రతి విషయాన్ని ట్విట్టర్లో పెట్టే కేటీఆర్ మేడిగడ్డ పర్యటన గురించి మాత్రం పెట్టలేదని అన్నారు. మేడిగడ్డ వెళ్లి తప్పు ఒప్పుకుంటారని అనుకున్నామని చెప్పారు.
ఎమ్మేల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డకు వెళ్లి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేతలు వినోదాన్ని పంచారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు నిన్న విహార యాత్రకి వెళ్లినట్టు అక్కడకు వెళ్లారని చెప్పారు.
కాళేశ్వరంపై లబ్ధి పొందిన వ్యక్తి ఇంట్లో పడుకున్నారని చెప్పారు. మేడిగడ్డ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే దోపిడీకి రంగం సిద్ధమైందని చెప్పారు. మేడిగడ్డలో లోపాలు ఉన్నాయని కేసీఆర్ కి ముందే తెలుసని అన్నారు.
Also Read: పొత్తా? సింగిలా? ఏపీ బీజేపీ ముఖ్య నేతలతో శివప్రకాశ్ భేటీ