PMO Office లో డిప్యూటీ కార్యదర్శిగా ఆమ్రపాలి

  • Publish Date - September 13, 2020 / 11:10 AM IST

IAS officers appointed in the PMO : ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు.



2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆమ్రపాలి… గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

ఏపీలోని విశాఖపట్టణంలో ఆమ్రపాలి జన్మించారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్‌ కాకముందు జూనియర్ రిలేషన్‌షిప్ బ్యాంకర్‌గా పని చేశారు.



2010లో సివిల్స్‌ రాసి 39వ ర్యాంక్ సాధించారు. మంచి ర్యాంక్ రావడంతో సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి మహిళా శిశు సంక్షేమ విభాగానికి ట్రాన్స్ ఫర్ అయ్యారు. 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఆమెను వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా నియమించింది.



చక్కటి పనితీరుతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ కలెక్టర్‌ గా పేరు పొందారు. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ..ప్రజల అభిమానాన్ని పొందారు. టెక్నాలజీ వాడకంలో ముందంజలో ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. యువతకు దగ్గరయ్యారు.